ఏప్రిల్‌ మొదటి వారంలో రాత పరీక్ష!

16 Feb, 2020 03:45 IST|Sakshi

ఏర్పాట్లు చేస్తున్న పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు

స్థానిక ఎన్నికలు జరిగితే.. పరీక్షలు మరి కొంత కాలం వాయిదా

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్‌ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 19 రకాలైన 16,208 ఉద్యోగాలకు జనవరి 10న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 7 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. మొత్తంగా 11,06,614 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఈ ఉద్యోగాల నియామకానికి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్‌ శాఖ.. ఏప్రిల్‌ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐదు రోజుల పాటు ఈ పరీక్షలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఒకవేళ రాష్ట్రంలో ఏప్రిల్‌ మొదటి వారంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే.. ఈ ఉద్యోగాల రాత పరీక్షలు మరికొంత కాలం వాయిదా పడే అవకాశం ఉందని కూడా తెలిపారు. రానున్న వారం పది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశాన్ని పరిశీలించి రాత పరీక్షల తేదీలపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు