బాబు పాలనలో రైతాంగం కుదేలు

7 Sep, 2018 12:13 IST|Sakshi
కార్యకర్తలతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు వస్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

జిల్లాలోని అన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చాలి

వజ్రకరూరు ధర్నాలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి

వజ్రకరూరు: చంద్రబాబు పాలనలో వ్యవసాయ రంగం కుదేలైందని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి  ధ్వజమెత్తారు. వజ్రకరూరును కరువు మండలంగా ప్రటించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ముందుగా పార్టీ శ్రేణులు షిర్డీసాయి ఆలయం నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తీవ్ర వర్షాభావంతో జిల్లాలో 5.71 లక్షల హెక్టార్లలో పంట తుడుచు పెట్టుకుపోయిందన్నారు. జిల్లాలోని 63 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రైతు రుణాలన్నింటినీ రీషెడ్యూల్‌ చేయాలన్నారు. బ్యాంకుల్లో వేలాలు ఆపాలని, పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్‌ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులు తీవ్రకష్టాల్లో ఉన్నా రుణమాఫీ మొత్తం విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని మండిపడ్డారు. రైతులు ప్రీమియం చెల్లించినా ఇన్యూరెన్స్‌ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లవుతున్నా స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారన్నారు. సీఎంకు అమరావతి భజన తప్ప మరోటి పట్టడం లేదని విమర్శించారు. వైఎస్‌ హంద్రీనీవా పనులు 90 శాతం పనులు పూర్తి చేసి జిల్లాకు కృష్ణ జలాలు తీసుకొస్తే టీడీపీ నాయకులు తామే తీసుకొచ్చినట్లు టీడీపీ నాయకులు ఫోజులు కొడుతున్నారన్నారు.  

కేశవ్‌ కొత్త నాటకం
ఎమ్మెల్సీ చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్‌ 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామంటూ రైతులను మభ్యపెడుతున్నారని, ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త నాటకానికి తెరతీశారని విశ్వ ధ్వజమెత్తారు. కాలువ తవ్వి నీరు ఇస్తున్నట్లు కేశవ్‌ ఆర్భాటం ప్రదర్శిస్తున్నారే తప్ప రైతులకు చేసిందేమీ లేదన్నారు. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయకపోవడంతో కళ్లముందే హంద్రీ–నీవా పారుతున్నా రైతులు వాడుకోలేని దుస్థితి నెలకొందన్నారు.  అనంతరం  తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌కు రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి సుశీలమ్మ, మండలాధ్యక్షుడు జయేంద్రరెడ్డి, వైస్‌ ఎంపీపీ నారాయణప్ప, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్యం ప్రకాష్, పార్టీ జిల్లా కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, జెట్పీటీసీ తిప్పయ్య, ఎంపీటీసీలు వెంకటేశ్‌నాయక్, రామాంజనేయులు, రవికుమార్, మాజీ సర్పంచులు యోగానంద, రుద్రప్ప,రఘు, లక్ష్మీబాయి, నాగేంద్ర, నాయకులు వెంకటరెడ్డి, నారాయణరెడ్డి, శంకర్‌రెడ్డి, మన్యం అనిల్, ఉస్మాన్, డిష్‌సురేష్, రాకెట్లబాబు, ముండాసు ఓబుళేసు, తిరుపాల్‌శెట్టి, రఘుపతి, కిరణ్, బెస్త ఆది, ప్రభుదాసు, సికిందర్, చిన్నపులికొండ, బత్తిన వెంకట్రాముడు, తిప్పారెడ్డి, ముత్యాల్,  సోమశేఖర్‌రెడ్డి, గూదె అనిల్, కమలమ్మ, ఈశ్వరమ్మ  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు