నారావారిపల్లెలోనూ పేరెంట్స్‌ అదే కోరుకున్నారు

20 Feb, 2020 14:43 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకువచ్చి తెలుగును తీసేశారనడం సరికాదని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో 48వేల పాఠశాలల పేరెంట్స్‌ కమిటీలు 97 శాతం ఆంగ్ల మాధ్యమమే కావాలని తీర్మానించిన విషయాన్ని గుర్తు చేశారు. చివరకు నారావారిపల్లెలోని పాఠశాల పేరెంట్స్‌ కమిటీ కూడా ఆంగ్ల మాధ్యమమే కావాలని తీర్మానించిందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార భాష వినియోగానికి ప్రభుత్వం రెండు నెలల కాలానికిగానూ రూ.2 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. తెలుగును మూసేశారన్నవారి నోళ్లు మూయించడానికి ప్రభుత్వం మండలానికో తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేయనుందని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాన్ని అభినందిస్తున్నామన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం తెలుగు మీడియం స్కూల్ దూరమైతే విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా కల్పించనుందని ఆయన తెలిపారు. (అమ్మ భాషకు పునరుజ్జీవం)

మరిన్ని వార్తలు