తణుకులో బాలుడు మృతి
తణుకు: క్రికెట్ ఆడనివ్వకపోవడంతో పాటు ఇంటికొచ్చి తన తల్లిదండ్రులుకు ఫిర్యాదు చేశాడన్న కోపంతో ఓ బాలుడు మరో బాలుడ్ని బ్యాట్తో కొట్టి చంపేశాడు. ఈ ఘటన శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చోటుచేసుకుంది. వివరాలు.. తణుకులోని కొమ్మాయి చెరువుగట్టులో ఉన్న కమ్యూనిటీ హాల్ వద్ద శుక్రవారం కొందరు పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. అయితే తనను ఆటకు తీసుకోలేదన్న కోపంతో సూరవరపు గణేశ్(16) వికెట్లు పడేశాడు. దీంతో సప్పా సంజీవ్కుమార్(16), మరికొందరు పిల్లలు గణేశ్ ఇంటికి వెళ్లి.. అతని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం గ్రౌండ్కు వచ్చి మళ్లీ క్రికెట్ ఆడుకుంటుండగా.. గణేశ్ పట్టరాని ఆగ్రహంతో వచ్చి సంజీవ్కుమార్ మెడపై క్రికెట్ బ్యాట్తో బలంగా కొట్టాడు. దీంతో సంజీవ్కుమార్ అక్కడికక్కడే కూలబడ్డాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే సంజీవ్ను తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్థారించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.