ప్రేమ వ్యవహారంలో యువకుడి ఆత్మహత్యాయత్నం

17 Jun, 2018 13:33 IST|Sakshi

యువతిని మర్చిపోవాలంటూ పోలీసులు వేధించారని ఆరోపణ

గుడివాడ టౌన్‌ : తమ ప్రేమ వివాహం విఫలం చేస్తూ పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శనివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం రూరల్‌ మండలం కల్వపూడి అగ్రహారం గ్రామానికి చెందిన వరిగంజి కుమార్, అదే మండలం చినఎరుకపాడు గ్రామానికి చెందిన వీరంకి శశికళ ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిరువురూ ఎంబీఏ విద్యను అభ్యసిస్తున్నారు. ఇరువురి సామాజిక వర్గాలు వేరు కావడంతో వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారు ఏలూరులోని బౌద్ధ సమాజంలో మార్చి 5వ తేదీన చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న శశికళ తల్లిదండ్రులు గుడివాడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. 

అనంతరం ఆమెను మర్చిపోవాలంటూ కుమార్‌ను రూరల్‌ ఎస్సై లోవరాజు, సీసీఎస్‌ కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు, కానిస్టేబుల్‌ రామచంద్రరావు బెదిరించడం ప్రారంభించారని బాధితుడి సోదరుడు తెలిపాడు. పోలీసుల వేధింపులతో మనస్తాపానికి గురైన కుమార్‌ శనివారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు కుమార్‌ను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడకు రిఫర్‌ చేశారు.  

మరిన్ని వార్తలు