బస్సు కింద పడి యువకుడి దుర్మరణం

17 Oct, 2013 03:27 IST|Sakshi
గోకవరం, న్యూస్‌లైన్ : గోకవరంలో బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు కింద పడి యువకుడు దుర్మరణం చెందాడు. దేవీపట్నం మండలం పోతవరం గ్రామానికి చెందిన కారం కృష్ణ ప్రసన్నదొర (23), తన స్నేహితుడు మడకం రమేష్‌దొరతో కలసి రంపచోడవరం మండలం పోలవరం గ్రామానికి వ్యవసాయ పనులకు బైక్‌పై బయలుదేరాడు. గోకవరం చేపల మార్కెట్ వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేస్తూ ఎదురుగా వచ్చిన మరో బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కృష్ణప్రసన్నదొర ఆర్టీసీ బస్సు వెనుక చక్రం కింద పడిపోయాడు. అతని స్నేహితుడు మరో పక్కకు పడిపోయ ూడు. 
 
 బస్సు కింద పడిన కృష్ణప్రన్నదొరను బస్సు కొంత దూరం ఈడ్చుకుపోవడంతో శరీరం నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని 108కి సమాచారం అందించారు. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రుడు సుమారు 20 నిమిషాలు మృత్యువుతో పోరాడాడు. పోలీసులు స్థానికుల సహాయంతో క్షతగాత్రుడిని ఆటోపై స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే క్షతగాత్రుడు మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మృతుడి తల్లి కారం నాగమణి ఆస్పత్రి వద్ద రోదిస్తున్న తీరు అందరినీ కంటతడిపెట్టించింది. నాగమణికి ఇద్దరు కుమారులు, కుమార్తె. పెద్దకుమారుడైన కృష్ణ ప్రసన్నదొర  ఇటీవల పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. 
 
 చేతికి అందివచ్చిన కొడుకు ఈ విధంగా ప్రమాదంలో మృతి చెందాడని ఆమె విలపించింది. సంఘటనపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గోకవరం ఎస్సై జీవీవీ నాగేశ్వరరావు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో 108 వాహనం అందుబాటులో లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 108 వాహనాల సేవలను అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని వారు కోరారు.
 
మరిన్ని వార్తలు