తీరని శోకం

4 Dec, 2018 11:24 IST|Sakshi
విలపిస్తున్న లక్ష్మీనారాయణ తల్లి వరహాలమ్మ

రైలు నుంచి జారిపడి ఇద్దరు యువకుల దుర్మరణం

మిస్టరీగా ఘటన.. మృతిపై పలు అనుమానాలు

కోటవురట్ల మండలం అన్నవరంలో విషాదం

విశాఖపట్నం, ఎస్‌.రాయవరం(పాయకరావుపేట): నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఇద్దరు యువకుల మృతి మిస్టరీగా మారింది. అన్నవరం గ్రామానికి చెందిన ఆ ఇద్దరు యువకుల మృతి రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగల్చగా, ఎలా మృతి చెందారనేది ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఆదివారం సాయంత్రం వరకూ గ్రామంలో తిరిగా రు. మిత్రులతో క్రికెట్‌ ఆడి సంతోషంగా గడిపారు. ఆ రాత్రి గడిచి సోమవారం

 తెల్లారుతుండగానే విషాద వార్త గ్రామస్తుల కంట కన్నీ రు పెట్టించింది. కోటవురట్ల మండలం అన్నవరం గ్రా మానికి చెందిన పైల లక్ష్మీనా రాయణ(20), బోళెం వాసు(22) ఆదివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మండలంలోని నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్‌ సమీపంలోని వంతెన వద్ద రైల్వే ట్రాక్‌పై ఇద్దరి మృతదేహాలు పడి ఉండడాన్ని సోమవారం గుర్తించా రు. పట్టాలకు మధ్యలో మృతదేహాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తుని స్టేషన్‌లో రైలు ఎక్కి  ఇద్దరూ విశాఖపట్నం వెళుతుండగా నర్సీ పట్నం రోడ్డు రైల్వే స్టేషన్‌ దాటాక ప్రమాదశాత్తూ జారిపడ్డారా? లేక ఎవరైనా రైలు లో నుంచి నెట్టేశారా అన్నది ప్రశ్నార్ధకం. లేకపోతే ఒకరు జారిపోతుండగా రక్షించబోయి మరో యువకుడు కూడా ప్రమాదానికి గురయ్యాడా? ఇవన్నీ అంతుపట్ట ని ప్రశ్నలు. గ్రామస్తులు, మిత్రుల కథ నం మేరకు ఇరువురు ఆత్మహత్య చేసుకునేంత పిరికివారు కాదని తెలుస్తోంది. ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామనే తప న ఇద్దరిలో ఉండేదంటున్నారు.

ఉద్యోగ ప్రయత్నంలోనే ఈ దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తమవుతోంది. పైల సత్తిబా బు, వరహాలమ్మకు ఒక కుమార్తె, కుమారుడు కాగా లక్ష్మీనారాయణ కుటుంబం లో చిన్నవాడు. ఐటీఐ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడితే అందొస్తాడని తల్లిదండ్రలు కలలు కన్నారు. వారి ఆశలను హరి స్తూ ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మరో యువకుడు బోళెం వాసు దంపతులు పాత్రుడు, సత్యవతులకు ముగ్గురు కుమార్తెల తరువాత పుట్టాడు. నిరుపేద కుటుంబం కావడంతో కష్టపడి డిప్లమా చదివించారు. ఉద్యోగంలో స్థిరపడితే కష్టాలు తీరిపోతాయని  ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేందుకు డ్రిప్‌ ఇరిగేషన్‌లో తాత్కాలికంగా పనిచేస్తున్నాడు. ఒక్కగానొక్క కుమారుడి మరణవార్త ఆ తల్లిదండ్రుల గుండెల్లో విషాదం నింపింది. మృతులు ఇద్దరూ ఒకే గ్రామస్తులు కావడంతో అన్నవరంలో విషాదం అలుముకుంది. రెండిళ్ల వద్ద స్థానికులు గుమిగూడారు. కాగా  తుని రైల్వే ఎస్‌ఐ ఎస్‌.కె.అబ్దుల్‌మరూఫ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు