‘దిల్‌దివానా’ సందడి

29 Jan, 2014 03:13 IST|Sakshi

నెల్లూరు(వేదాయపాళెం),న్యూస్‌లైన్ : నెల్లూరుకు చెందిన యువకుడు రోహిత్‌రెడ్డి హీరోగా నటించిన దిల్‌దివానా చిత్ర యూనిట్ నగరంలో మంగళవారం సందడి చేసింది. ప్లాటినమ్ డిస్క్ ఆవిష్కరణ కోసం నెల్లూరుకు వచ్చిన సినీ నటులు డీఆర్ ఉత్తమ్ హోటల్లో బస చేశారు. హీరోలు రోహిత్‌రెడ్డి, రాజ్‌అర్జున్, హీరోయిన్లు నేహాదేశ్‌పాండే, కృతికా సింగాల్, దర్శకులు కిరణ్ తుమ్మా, నిర్మాత రాజారెడ్డి, సంగీత దర్శకుడు రామ్‌నారాయణతో పాటు యూనిట్ సభ్యులను చూసేందుకు యువత పోటీపడ్డారు. ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ సింహపురిలో పుట్టి నటుడిగా ఎదగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. నెల్లూరులో ఓ సినిమాను చిత్రీకరించి ఇక్కడి రుణం తీర్చుకుంటానని చెప్పారు. దర్శకుడు కిరణ్‌తుమ్మా మాట్లాడుతూ వచ్చే నెల 7వ తేదీన సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు.
 
 డైమండ్స్ విడుదల
 నగరంలోని జైన్‌గోల్డ్ షోరూంను దిల్‌దివానా చిత్ర యూనిట్ సందర్శించారు. వజ్రాభరణాలను తిలకించి అలంకరించుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. అనంతరం జైన్‌గోల్డ్ ఆధ్వర్యంలో డైమండ్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. నటులు రోహిత్, రాజ్, నేహ, కృతికలు వాటిని ధరించారు. అనంతరం జైన్‌గోల్డ్ అధినేత మణిలాల్ జైన్ మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో వీవీఎస్/ఈఎఫ్ క్వాలిటీతో నూరుశాతం దోషరహితమైన వజ్రాలను గ్యారెంటీతో విక్రయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం నరేంద్రజైన్, పారస్మల్‌జైన్, రాజేష్‌జైన్ పాల్గొన్నారు.
 
 నెల్లూరు బిర్యానీ సూపర్
 వీఆర్సీ సెంటర్లోని ఉన్న శుభమస్తు షోరూంలో చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. హీరోయిన్లు నేహా, కృతిక మాట్లాడుతూ నెల్లూరు చాలా బాగుందన్నారు. ఇక్కడి వారి అభిమానం జీవితంలో మరిచిపోలేమని చెప్పారు. నెల్లూరు బిర్యానీ సూపర్ అన్నారు. అనంతరం ఇక్కడి సిబ్బంది, అభిమానులతో ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో బయ్యా శ్రీనివాసులు, బయ్యా రమణయ్య, బయ్యా రవి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు