గుహల పరిశోధనలో యంగ్‌ సైంటిస్ట్‌

13 Nov, 2017 07:46 IST|Sakshi
షేక్‌ షాబుద్దీన్‌

నేడు ఏఎన్‌యూలో సత్కారం

తెనాలి: ఇంజినీరింగ్‌ – మెడిసిన్‌లే ఉన్నత విద్యకు కొలమానంగా పరిగణిస్తున్న నేటి రోజుల్లో ఓ యువకుడు భిన్నమైన జంతుశాస్త్రాన్ని ఎంచుకుని అరుదైన పరిశోధనలోకి అడుగుపెట్టాడు. గుహల్లోని జీవవైవిధ్యం అన్వేషణలో జాతీయ అవార్డు.. తాజాగా ఏపీ కాంగ్రెస్‌లో ‘యంగ్‌ సైంటిస్ట్‌’ అవార్డు అందుకున్నాడు. యువ శాస్త్రవేత్త షాబుద్దీన్‌ షేక్‌ అద్భుత ప్రతిభకు సోమవారం ఆచార్య నాగార్జున  వర్సిటీలో సత్కారం జరగనుంది. షాబుద్దీన్‌ స్వస్థలం గుంటూరు. తండ్రి అమానుల్లా సాధారణ మెకానిక్‌. తల్లి రహమతూమ్‌ గృహిణి. షాబుద్దీన్‌ చిన్నతనం నుంచి తెనాలిలోని తాతయ్య, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ షేక్‌ మొహిద్దీన్‌ బాచ్చా దగ్గర పెరిగాడు.

ఇంటర్‌ తర్వాత గుంటూరు హిందూ కాలేజిలో డిగ్రీ  చేసి, జువాలజీలో బంగారుపతకం పొందాడు.  వర్సిటీలో ఎంఎస్సీ పూర్తిచేశాడు. భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో గుహల్లో జీవవైవిధ్యం పరిశీలనకు  దేశంలోనే తొలిసారిగా నాగార్జున వర్సిటీ కేంద్రంగా ప్రారంభమైన ప్రాజెక్టులో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోగా  అవకాశం దక్కించుకుని డాక్టర్‌ రంగారెడ్డి నేతృత్వంలో ఆరేళ్లుగా దేశంలోని వివిధ గుహలపై పరిశోధన చేశారు. అనేక అవార్డులు అందుకున్నారు. గుహల పరిశోధనలో భారతదేశంలోనే తొలి వ్యక్తిగా గుర్తింపు పొందిన ఈ యువశాస్త్రవేత్త, ఇకపై చైనాలోనూ అధికారికంగా ఇలాంటి గౌరవాన్ని దక్కించుకోనున్నారు.

మరిన్ని వార్తలు