నాన్నా... సారీ..

16 Jan, 2014 06:01 IST|Sakshi
నాన్నా... సారీ..

సత్తుపల్లి రూరల్, న్యూస్‌లైన్: తన ఉన్నతికి కారణమైన తండ్రికి ప్రేమతో మోటార్ సైకిల్‌ను కానుకగా ఇవ్వాలనుకున్నాడు ఓ యువకుడు. కానీ, ఆ కోరిక తీరకుండానే.. తండ్రి చివరి చూపు, చివరి మాట అందనంత దూరంగా.. అనంతలోకానికి వెళ్లిపోయాడు.సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన నాగుల వీరవెంకయ్య కుమారుడైన ఆంజనేయులు(25) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మరో నెల రోజుల్లో అమెరికావెళ్లాల్సుంది. అతను సంక్రాంతి పండుగకని ఇంటిల్లిపాదితో గడిపేందుకు ఇటీవల ఇంటికి వచ్చాడు. తన ఉన్నతికి కారణమైన తండ్రికి ప్రేమతో సంక్రాంతి కానుకగా, తన సంపాదనతో మోటార్ సైకిల్ కొని స్వయంగా ఇవ్వాలనుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు మంగళవారం వెళ్లాడు.
 
 అక్కడ మోటార్ సైకిల్ కొని, దాని పైనే తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో, పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం మల్లాయిగూడెం వద్ద ఓ వ్యక్తి మద్యం మత్తులో రోడ్డుపైకి అడ్డంగా వచ్చాడు. అతనిని తప్పించే ప్రయత్నంలో ఆంజనేయులు నడుపుతున్న మోటార్ సైకిల్ కిందపడింది. తలకు బలమైన గాయం, తీవ్ర రక్తస్రావంతో ఆంజనేయులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతను కొన ఊపిరితో ఉండి ఉంటే.. చివరిసారిగా తండ్రితో ఒక్క మాటయినా మాట్లాడగలిగితే.. ‘నాన్నా... సారీ..’ అని అనేవాడేమో...! ఆంజనేయులు మృతదేహాన్ని వైఎస్‌ఆర్ సీపీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మట్టా దయానంద్ విజయ్‌కుమార్, కంపెనీ సీఈఓ, సహచర ఉద్యోగులు సందర్శించారు. శోకసంద్రంలో మునిగిన అతని కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.

>
మరిన్ని వార్తలు