చిన్న వయసులో చితికిపోతున్నయువత

18 Nov, 2019 08:58 IST|Sakshi

పిల్లలు ఉదయాన్నే చక్కగా తయారై... భుజాన బ్యాగ్‌ వేసుకుని... మక్కువతో కొనిచ్చిన స్కూటీపై రయ్‌...రయ్‌... మంటూ కాలేజ్‌కు దూసుకుపోతున్న పిల్లల్ని చూస్తే ఏ తల్లిదండ్రికైనా సంబరమే. కానీ వారి ప్రవర్తనలో వస్తున్న మార్పులు గమనించకపోతే... ఆ ఆనందం ఎంతో కాలం నిలవదు. వారు నిజంగా కళాశాలకే వెళ్తున్నారా... అక్కడ వీరు ఎలాంటి పిల్లలతో స్నేహం చేస్తున్నారు... ఎన్నిగంటలకు ఇంటికి చేరుతున్నారు... ఎక్కడెక్కడకు తిరుగుతున్నారు... చదువులో ఏమేరకు రాణిస్తున్నారు... ఇలాంటివి తెలుసుకోలేకపోతే ఇక గర్భశోకం తప్పదు. యుక్తవయసులో పిల్లలు సాధారణంగా చెడు సహవాసాలతో తప్పటడుగులు వేసే ప్రమాదం ఉంది. వాటిజోలికి పోకుండా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. 

సాక్షి, విజయనగరం ఫోర్ట్‌: అభం శుభం తెలియని వయసులో ఒకరి చేతిలో మోసపోయి తల్లులవుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. చక్కగా చదువుకో వాల్సిన వయస్సులో ప్రేమ మోజులో పడి మోసపోతున్నారు. కొంతమంది ఆకర్షణకు లోనవుతుండగా...మరికొందరు చెడు సహ వాసాలతో మోసపోతున్నారు. యుక్తవయసు లో సాధారణంగా తలెత్తే సమస్యలు... ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... ప్రేమ, ఆకర్షణ వంటివాటివల్ల కలిగే స మస్యలేమిటో తెలియజేస్తున్నారు. అయినా అ మ్మాయిలు నిత్యం మోసపోతూనే ఉన్నారు. 

15, 16 ఏళ్ల అమ్మాయిలే అధికం 
పదోతరగతి... ఇంటర్మీడియేట్‌... చదువుతున్నవారు అంటే 15, 16 సంవత్సరాల వయ సు కలిగినవారే ఎక్కువగా ప్రేమ, ఆకర్షణకు గురవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఫేస్‌బుక్, వాట్సప్, యూట్యూబ్‌ వంటి వాటి ప్రభావం వల్ల ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. స్మార్ట్‌ ప్రభావం కూడ అమ్మాయిలు, అబ్బాయిలపై ప్రభావం చూపుతుంది. పాఠశాలలకు, కళాశాలలకు స్మార్ట్‌ ఫోన్లు పట్టుకుని వెళ్తున్నారు. గంటల తరబడి చాటింగ్‌లు చేసుకుంటున్నారు.  

పెళ్లికాకుండానే తల్లులై... 
16, 17 ఏళ్లకే ప్రేమ, ఆకర్షణ పేరుతో చిన్న వయస్సులో  శారీరకంగా కలిసిపోతున్నారు. దీనివల్ల పెళ్లికాకుండానే గర్భం దాల్చుతున్నారు. పిల్లలకు జన్మనిస్తున్నారు. కొందరు ముందు జాగ్రత్తగా పిల్లల్ని కనవలసి వస్తోందని భ్రూణహత్యలకు పాల్పడుతుండగా... ఇంకొందరు పుట్టిన బిడ్డను చెత్తకుప్పల్లో పడేస్తున్నారు.  

తల్లిదండ్రులను ధిక్కరించి... 
కొందరు అమ్మాయిలు ఆకర్షణకులోనై తల్లిదండ్రులను ధిక్కరిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిపోతున్నారు. ప్రేమించిన వాడితో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి సహజీవనం చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఇటీవల ఎక్కువ సంఖ్యలో చోటు చేసుకుంటున్నాయి. చదువుకున్న అమ్మాయిలే ఎక్కువగా చేయడం గమనార్హం. వంచన... ఇంటినుంచి వెళ్లిపోవడం వంటివి గడచిన 11 నెలల్లో వందవరకూ నమోదయినట్టు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వీరంతా మైనర్లే కావడం విశేషం. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి తల్లిదండ్రులు నిఘా పెంచితే క్షణికావేశంలో ప్రాణాలు తీసేసుకుంటున్నారు. దీనికి భయపడి తల్లిదండ్రులు మిన్నకుండి పోతున్నారు. 

⇔ గజపతినగరం మండలానికి చెందిన 17 ఏళ్ల బాలిక  ఇంటర్మీడియట్‌ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ ఆమెను ప్రేమ పేరుతో లోబరచుకున్నాడు. ఫలితంగా బాలిక గర్భవతి అయింది. మూడు రోజుల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చింది. 

⇔ విజయనగరం పట్టణంలోని ఓ బాలిక 9వ తరగతి వరకు చదివి మానేసింది. అదే ప్రాంతానికి చెందిన ఓ  మైనర్‌ బాలుడు ఆమెను గర్భవతిని చేశాడు. వీరికి రెండు రోజుల క్రితం పాప పుట్టి చనిపోయింది.

పిల్లల ప్రవర్తనను గమనిస్తుండాలి 
పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారు ఇంట్లో, బయట ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుం టూండాలి. మంచివారితో స్నేహం చేసేలా చూడాలి. స్మార్ట్‌ ఫోన్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడం మంచింది, చెడు అలవాట్లకు బానిస కాకుండా చూడాలి.  
– పి.సాయి విజయలక్ష్మి, ఆడ్మినిస్ట్రేటర్, వన్‌స్టాప్‌ సెంటర్‌(సఖి) 

అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం 
గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్, ఆకర్షణ, ప్రేమ వంటి వాటిపై కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది 181 అవగాహన సదస్సులు నిర్వహించాం. సోషల్‌ మీడియా ప్రభావం వల్ల ఎక్కువ మంది ప్రేమ, ఆకర్షణకు లోనవుతున్నారు. మంచి, చెడుల గురించి తల్లిదండ్రులు వారి పిల్లలకు తెలియజేయాలి. 
– కె.రమాదేవి, కౌన్సిలర్, వన్‌స్టాప్‌ సెంటర్‌   

మరిన్ని వార్తలు