రైతులను విస్మరిస్తే పుట్టగతులుండవు

14 Feb, 2019 13:59 IST|Sakshi
నాయకులను గజమాలతో సత్కరిస్తున్న కార్యకర్తలు

వచ్చే ఎన్నికల్లో బాబుకు, ఆదికి బుద్ధి చెప్పాలి

మరోజన్మ ఉంటే దళితుల ఇంట్లో జన్మించాలని ఉంది

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

వైఎస్‌ఆర్‌ జిల్లా , రాజుపాళెం : రైతులకు కల్లబొల్లి మాటలు చెబుతున్న సీఎం చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తారని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. రాజుపాళెం మండలంలోని గోపాయపల్లె గ్రామంలో ఎంపీటీసీ సభ్యురాలు జీరెడ్డి అంజనీకుమారి, గ్రామ వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు జీరెడ్డి గోవర్థనరెడ్డితో కలిసి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ఈప్రాంతంలోని కేసీ రైతుల కష్టాల పరిస్థితి తనకు తెలుసునని, పంట వేసినప్పుడు నీళ్లు ఇస్తారని, మధ్యలోనే ఆపేస్తారని, దీని వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.వారిని విస్మరిస్తే పుట్టగతులు ఉండవన్నారు.కేసీ రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజోలి జలాశయంలో మూడు టీఎంసీలు నిల్వ ఉండేందుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజోలి జలాశయ నిర్మాణాన్ని విస్మరించారన్నారు. కేసీ రైతులకు స్థిర సాగు నీరు ఇచ్చేందుకు వందల ట్రాక్టర్లు, వేలాది మంది రైతులతో కలిసి కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేయడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే జగనన్న రాజోలి రిజర్వాయరును తప్పకుండా నిర్మించి, రైతుల కళను సాకారం చేస్తారన్నారు.

గోపాయపల్లెలో ఘనస్వాగతం
కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డికి బుధవారం గోపాయపల్లె గ్రామంలో ఎంపీటీసీ సభ్యురాలు జీరెడ్డి అంజనీకుమారి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు జీరెడ్డి గోవర్థనరెడ్డి వారికి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, పోరెడ్డి నరసింహారెడ్డి, రాష్ట్ర సెక్రటరీ జింకా విజయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఎర్రి రమణారెడ్డి, ప్లోర్‌ లీడర్‌ వంగనూరు మురళీధర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వెల్లాల భాస్కర్, ముస్లిం మైనార్టీ మండల కన్వీనర్‌ మానుకింది ఖాదర్‌బాష తదితరులు ఉన్నారు.

ప్రత్యేక హోదా కోసం...
నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానని చెబుతున్న చంద్రబాబు చివరలో యూ టర్న్‌ తీసుకున్నాడని మాజీ ఎంపీ అన్నారు. ఎవరు ప్రత్యేక హోదా కోసం పోరాడేది అందరికి తెలుసునని, ఇప్పటికైనా అలాంటి దొంగ దీక్షలను చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు. దళితుల ఇంట్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా, శుభ్రంగా ఉండరు, వారికి విద్య అవసరమా అని చెప్పిన మంత్రి ఆదికి దళితులపై ఏమేరకు ప్రేమఉందో వారి మాటల్లోనే తెలుస్తుం దన్నారు.  మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి గెలుపు ముఖ్యం కాదని, 50వేల పైచిలుకు మెజార్టితో గెలిపిం చాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

దళితులంటే చిన్నచూపా..?
రాజుపాళెం: దళితుల ఇంట్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని మాట్లాడిన చంద్రబాబు, వారు శుభ్రంగా ఉండరు వారికి విద్య అవసరమా అని చెప్పిన మంత్రి ఆదినారాయణరెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఓటు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. మండలంలోని గోపాయపల్లె గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ నాయకులకు దళితులంటే చిన్న చూపని,   ఓట్ల కోసం కాళ్ల బేరానికి వస్తారన్నారు. అప్పుడు ఓటుతో చిత్తుగా ఓడించాలని ఎస్సీ కాలనీ ప్రజలకు పిలుపునిచ్చారు. మరో జన్మ ఉంటే దళితుల ఇంట్లో పుట్టాలని ఉందని, కుల అహంకారం కలిగిన వారికి బుద్ధిచెప్పే అవకాశం వచ్చిందని ఎమ్మెల్యే అన్నారు.ఏడు నియోజకవర్గాల దళిత ఓటర్లు తమ ఓటుతో ఆదికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. పార్టీ మండల కన్వీనర్‌ నారాయణరెడ్డి, పాతకోట బంగారురెడ్డి, పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, ప్రొద్దుటూరు మండల కన్వీనర్‌ దేవీ ప్రసాదరెడ్డి, మాజీ సర్పంచ్‌లు రామలింగారెడ్డి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు