సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర బుధవారం నక్కపేట క్రాస్ వద్ద ముగిసింది. వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం క్రిష్ణాపురం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి పురుషోత్తపురం క్రాస్, మెట్టక్కివలస క్రాస్, ఊసవాని పేట, రెడ్డిపేట క్రాస్, కొత్తవాని పేట, భైరవాని పేట మీదుగా నక్కపేట క్రాస్ వరకు జననేత పాదయాత్ర కొనసాగింది. నేడు వైఎస్ జగన్ 6.8 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు జననేత 3,441.9 కిలోమీటర్లు నడిచారు.
వైఎస్సార్ సీపీలో చేరిన తాళ్ల అనురాధ
ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్ను తూర్పు గోదావరి జిల్లా అల్లవరంకు చెందిన చింతా కృష్ణమూర్తి కుమార్తె తాళ్ల అనురాధ కలిశారు. ఆమె జననేత సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, కొండేటి చిట్టిబాబు, కర్రి పాపారాయుడు, మోహన్ రావులు పాల్గొన్నారు.