విద్యా విప్లవానికి నాంది

28 Mar, 2019 09:55 IST|Sakshi

‘అమ్మఒడి’తో పిల్లలు చదువుల బాట 

ప్రతి తల్లి ఖాతాకు రూ. 15వేలు నగదు జమ 

సాక్షి, దర్శి టౌన్‌: విద్య విజ్ఞాన వికాసానికి చిరునామా..ఉజ్వల భవిష్యత్‌కు మార్గదర్శకం. బాల్యంలో సరైన పునాది పడితేనే బంగారు భవిష్యత్‌కు నాంది అవుతుంది. విద్యతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో పలువురు నిరుపేదలు మధ్యలోనే చదువుకు దూరమవుతున్నారు. భవిత అంధకారంగా మారి కూలీలుగా మారుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుపేదలకు విద్య వైపు ప్రోత్సహించడానికి అమ్మ ఒడి పథకం ప్రకటించారు. ఈ పథకం ప్రయోజనాలు తెలుసుకున్న సామాన్య, మధ్య తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

పేద విద్యార్థులకు ప్రయోజనాలు ఇవే ....
 ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బడికి పంపే పిల్లలకు ఒక్కక్కరికి రూ. 500, ఇద్దరు ఉంటే రూ. 1000లు చెల్లిస్తారు. 
 5 నుంచి 10వ తరగతి వరకు బడికి వెళ్లే విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ. 750, ఇద్దరు ఉంటే రూ. 1500లు చెల్లిస్తారు. 
 ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికీ ప్రతి నెల రూ.1000లు, ఇద్దరు ఉంటే రూ. 2000లు అందుతుంది. 
 ఉన్నత చదువుల కోసం విద్యార్థుల మెస్‌ చార్జీలకు రూ. 20వేలు చెల్లిస్తారు. 

దర్శి నియోజకవర్గంలో...
దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో  72,715 మంది విద్యను అభ్యసిస్తున్నారు. అందులో  344 ప్రాథమిక, యూపీ,  ఉన్నత పాఠశాలలో  31,215మంది, 31 ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 41,500 మంది విద్యను అభ్యసించే వారిలో ఉన్నారు. 

ఇలాంటి పథకం ఎక్కడా లేదు
ప్రతి నెలా పిల్లలకు చదువు కోసం నగదు ఇవ్వడం మంచి పరణామం. దేశంలో ఎక్కడా ఇటువంటి పథకం ఏ ప్రభుత్వం అమలు పరచడం లేదు. ఇది అమలు జరిగితే పేద విద్యార్థులు విద్యావంతులవుతారు. ఉన్నత శిఖరాలకు చేరుకుని ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. 
–  ముఖం లక్ష్మికుమారి, కురిచేడు 

పేదలకు వరం 
కూలీ నాలి చేసుకుని జీవనం కొనసాగించే వారి పిల్లలను చదివించే స్థోమత లేని పరిస్థితిలో నిరక్షరాస్యులుగా మిగిలుతున్నారు. కూలి పనులకు వెళ్తేనే పూట గడిచే పరిస్థితిలో ఇక పిల్లల గురించి ఏమి ఆలోచిస్తారు. అమ్మ ఒడి పథకం అమలయితే అనేక మంది విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి. 
– దేసు రజని, కురిచేడు 

మాలాంటి వాళ్లకు ఉపయోగం
నేను ఇలాంటి పథకాన్ని ఎప్పుడూ వినలేదు. పిల్లల కోసం ఏ నాయకుడూ ఆలోచించ లేదు. మేము పొలం కూలి పనులు చేసుకుని జీవించాలి. మాలాంటి వాళ్లకు ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది. మా పిల్లల భవిష్యష్యత్‌కు డోకా లేకుండా ఉంటుంది. 
– వెన్నా రమణ, విద్యార్థిని తల్లి, పొట్లపాడు


పాఠశాలల్లో విద్యార్థులు పెరుగుతారు 
ఇలాంటి పథకాల వలన పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ప్రతి ఒక్కరికీ తమ పిల్లలను చదివించుకోవాలనే ఆలోచన కలుగుతుంది. తాము పేదరికంలో ఉన్న తమ పిల్లలకు బంగారు భవిష్యత్‌ను అందించే అవకాశం ఉంది. ఇలాంటి నాయకులు మనకు అవసరం.
– సుబ్బులు, తాళ్లూరు

అమ్మ ఒడి ఒక వరం
అమ్మ ఒడి పథకం పిల్లల పాలిట ఒక వరం.  ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇచ్చి చదివించేవారు లేరు. చదివించే శక్తి లేక పొలం పనులకు తీసుకెళ్లాల్సి వస్తుంది. జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ పథకం వస్తే పిల్లలు చదువుకుని చల్లగా నీడ పట్టున బతికే అవకాశం కలుగుతుంది. మా కష్టాలు వారికి రాకుండాపోతాయి.
– యేరేసి సుబ్బులు, విద్యార్థిని తల్లి, గంగదొనకొండ

పిల్లలు బాగుపడతారు
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అమలు చేసే పథకంలో అమ్మ ఒడి వలన ఎంతోమంది పేద పిల్లల జీవితాలు ధన్యమవుతాయి. చదువుకునే స్థోమత లేక బజార్ల వెంట కాగితాలు ఏరుకుంటున్నారు. అలాంటి పిల్లలందరూ బడికి వచ్చి చక్కగా చదువుకుని బాగు పడతారు.
సూరా వెంకటరత్నం, కురిచేడు 

మరిన్ని వార్తలు