‘మాట నిలబెట్టుకుని.. మీ ముందు నిలబడ్డా’

7 Nov, 2019 12:55 IST|Sakshi

సాక్షి, గుంటూరు : అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తున్నందకు ఆనందంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్‌ స్కామ్‌ జరిగిన బాధితులకు న్యాయం జరగలేదని గుర్తుచేశారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్‌ బాధితుల తరఫున పోరాటం చేశామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అండగా నిలబడుతున్నామని తెలిపారు. గురువారం గుంటూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘మీ సోదరుడు అధికారంలోకి వస్తే న్యాయం చేస్తాడని భావించిన అక్కాచెల్లమ్మలకు ధన్యవాదములు. అగ్రిగోల్డ్‌ బాధితులు ఐదేళ్లుగా పడుతున్న బాధలు చూశా.. మీ అందరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మీ ముందు నిలబడ్డాను. 3,648 కి.మీ సాగిన నా పాదయాత్రలో ప్రతి గ్రామంలో అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలను విన్నాను. నేను ఉన్నానని మాట ఇచ్చాను. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తొలి అడుగు వేశాను.  కోర్టు పరిధిలో ఉన్నా.. తొలి విడతలో భాగంగ దాదాపుగా 3.70లక్షల మంది బాధితులకు న్యాయం చేస్తున్నాం.  రూ. 10వేలలోపు డిపాజిట్లు ఉన్న బాధితులను ఆదుకునేందుకు రూ. 264 కోట్లు విడుదల చేశాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్‌లోనే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు కేటాయింపులు చేశాం. ఐదు నెలల్లోపే బాధితులకు న్యాయం చేయగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరింత మందికి న్యాయం చేస్తాం. త్వరలోనే రూ. 20వేలలోపు డిపాజిట్‌ చేసినవారికి డబ్బులు అందజేస్తాం. 

ఈ ఐదు నెలల్లోనే నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం. గ్రామా సచివాలయాల ద్వారా లక్ష 30వేల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. 2.25 లక్షల మంది ఆటో కార్మికులకు.. వైఎస్సార్‌ వాహన మిత్ర అందించాం.  పాదయాత్రలో చెప్పిన విధంగా ప్రతి రైతన్నకు రైతు భరోసా అందించాం. అప్పుడు రూ. 12,500 రైతులకు ఇస్తామని చెప్పిన.. దానిని రూ. 13,500కు పెంచాం. అవ్వాతాతల పెన్షన్‌ కోసం రూ. 1350 కోట్లు మంజూరు చేశాం. గత ప్రభుత్వం కంటే  మూడు రెట్లు అధికంగా పించన్‌ ఇస్తున్నాం. 65 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కంటి వెలుగు అందిస్తున్నాం. 4.5 లక్షల మంది విద్యార్థులక శస్త్ర చికిత్సల చేయించడం, కంటి అద్దాలు అందజేయడం చేశాం. 

ప్రైవేటు రంగంలో నిరుద్యోగ యువతకు మేలు జరగాలని.. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం తీసుకోచ్చాం. ఏడాదికి రూ. 10 వేలు ఇస్తూ ఆటో కార్మికులను ఆదుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా జూడిషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. దేశంలో ఎవరు చేయని విధంగా రివర్స్‌ టెండరింగ్‌ తీసుకొచ్చాం. పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేశాం. అవినీత రహితంగా, పారదర్శకంగ పాలన కొసాగిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నామినేటేడ్‌ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం’ అని తెలిపారు. ఇంకా గొప్పగా.. మీ మనస్సులో నిలబడే విధంగా పాలన కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. 

అర్హులకు మరో అవకాశం.. 
ఇప్పటివరకు తమ పేరు నమోదు చేసుకోని అర్హులైన అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు సీఎం వైఎస్‌ జగన్‌ మరో అవకాశం కల్పించారు. అలాంటి వారు.. నెల రోజుల్లోగా జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకోవచ‍్చని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. కలెక్టరేట్‌, ఎమ్మార్వో, గ్రామ సచివాలయాల్లో కూడా నమోదు చేసుకోవచ‍్చని అన్నారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు