'బాబు మోసాల్ని ఎండగట్టేందుకే జగన్ దీక్ష'

20 May, 2015 04:45 IST|Sakshi
'బాబు మోసాల్ని ఎండగట్టేందుకే జగన్ దీక్ష'

ప్రజల్ని మోసగించింది చాలక విజయయాత్రలా?: అంబటి
సాక్షి, హైదరాబాద్: ఏడాది పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాలను ఎండగట్టేందుకే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ మొదటివారంలో విజయవాడ-గుంటూరు పరిసరాల్లో దీక్ష చేయబోతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చే విషయంలో ఏడాదిపాటు ప్రజలను మోసం చేసింది చాలక టీడీపీ విజయ యాత్ర, నవనిర్మాణ దీక్ష, నూతన రాజధానికి శంకుస్థాపన వంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
 
‘‘రైతులు, డ్వాక్రా మహిళల రుణాల విషయంలో ఎన్నికలకు ముందు బాబు ఏం చెప్పారు? సీఎం అయ్యాక ఏం చేశారు? టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న వాగ్దానాలన్నీ ఏమయ్యాయి?’’ అని అంబటి ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను ఆయన చదివి వినిపిస్తూ వీటిలో ఏ ఒక్కటైనా నెరవేర్చారేమో టీడీపీ నేతలు చెప్పాలన్నారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే సమస్యలన్నీ తీరవు’ అని ఢిల్లీ పర్యటనలో బాబు చెప్పడం చూస్తే ‘అందని ద్రాక్ష పళ్లు పుల్లన...’ అనే సామెత గుర్తుకొస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తేనే సమస్యలన్నీ తీరిపోతాయని తామూ భావించట్లేదని, అయితే ఎన్నికల ముందు ఈ విషయంపై బాబు, వెంకయ్య ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలని సూచించారు.
 
‘పోలవరం’పై ఉదాశీన వైఖరి: కొత్తపల్లి
నల్లజర్ల రూరల్: పోలవరం విషయంలో ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందని వైఎస్సార్‌సీపీ పశ్చిమగోదావరి జిల్లా శాఖ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. మంగళవారం నల్లజర్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ గద్దెనెక్కి ఏడాది కావస్తున్నా ప్రాజెక్ట్ పనులు కంటితుడుపుగా ఉన్నాయని, ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనే గొప్ప ప్రాజెక్ట్ పోలవరమని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే కేంద్రం నుంచి నిధులు విడుదల అవుతాయన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయిస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు