క్యారెట్‌ రైతులకు ప్రభుత్వం భరోసా

4 May, 2020 08:27 IST|Sakshi

రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిత్యం కృషి చేస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలోనూ రైతులకు చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తోంది. జిల్లాలో క్యారెట్‌ పండిస్తున్న రైతులకు మార్కెట్‌ సౌకర్యం కలి్పంచడమే కాకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే ప్రక్రియకు పూనుకుంది. గిట్టుబాటు ధర లభిస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 

సాక్షి, చిత్తూరు ‌: జిల్లాలోని పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, ములకలచెరువు మండలాల్లోని రైతులు దాదాపు 100 ఎకరాల్లో క్యారెట్‌ సాగు చేస్తున్నారు. అయితే లాక్‌డౌన్‌ ఉన్నందున దిగుబడి అయిన క్యారెట్‌ను అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఈ విషయాన్ని రైతులు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చొరవ తీసుకుని అధికారులకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే ఉద్యాన, మార్కెటింగ్‌ శాఖాధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పంట పరిస్థితులను పరిశీలించారు. 

మార్కెట్‌ సౌకర్యం 
క్యారెట్‌ రైతుల కష్టాలను తెలుసుకున్న ప్రభుత్వం వారం రోజులుగా వాటి విక్రయానికి చర్యలు చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో క్యారెట్‌ను అధికారులు కొనుగోలు చేసి, రైతు బజార్లకు తరలించే విధంగా మార్కెట్‌ సౌకర్యం కలి్పంచింది. కిలో క్యారెట్‌ను రూ.13 చొప్పున రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రాష్ట్రంలోని పలు జిల్లాల రైతుబజార్లకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతిరోజూ ఐదు టన్నులకు పైగా ఎగుమతి చేస్తూ ఇప్పటికీ 33 టన్నుల క్యారెట్‌ను ఎగుమతి చేశారు. మొత్తం 700 టన్నుల మేరకు దిగుబడి అయ్యే అవకాశమున్నందున నిత్యం క్యారెట్‌ తరలించే విధంగా అధికారులు చర్యలు తీసు కున్నారు. దీంతో కష్టకాలంలోనూ తమకు గిట్టుబాటుధర కలి్పంచడమే కాకుండా నేరుగా పొలం వద్దనే క్యారెట్‌ను కొనుగోలు చేయడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

కష్టకాలంలో ఆదుకున్నారు 
లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం ముందుకొచ్చి క్యారెట్‌ను కొనుగోలు చేయడం చాలా ఆనందంగా ఉంది. రోజూ అధికారులే పొలం వద్దకు వచ్చి కిలో రూ.13 చొప్పున కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. 
– శ్రీనాథ్, రైతు, పీటీఎం మండలం 

కలత చెందాల్సిన అవసరం లేదు
రైతులు పండించిన ఏ పంట దిగుబడికైనా కలత చెందాల్సిన అవసరం లేదు. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా మార్కెట్‌ సౌకర్యం కల్పించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రైతులకు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకువస్తే సత్వర చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం క్యారెట్‌ను విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. 
– శ్రీనివాసులు, ఉద్యాన శాఖ డీడీ

మరిన్ని వార్తలు