‘సదావర్తి’లో అక్రమాలపై విజి‘లెన్స్‌’

4 Sep, 2019 04:24 IST|Sakshi
విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి అధికార పార్టీ నేతలకు సదావర్తి సత్రం భూములను కారుచౌకగా కట్టబెట్టేందుకు జరిగిన ప్రయత్నాలపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సత్రం పేరిట చెన్నై సమీపంలో ఉన్న 83.11 ఎకరాలను అతి తక్కువ ధరకు కొందరు టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడం, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటం చేయడంతో భూముల అమ్మకం ప్రక్రియ నిలిచిపోయింది.

అప్పట్లో జరిగిన వేలం ప్రక్రియలో అవకతవకలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ ద్వారా విచారణ జరిపిస్తామని ప్రస్తుత ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో హామీ ఇచ్చింది. ఈ మేరకు విచారణకు ఆదేశిస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి మన్‌మోహన్‌సింగ్‌ జీవో జారీ చేశారు. భూముల అమ్మకానికి అప్పట్లో ప్రభుత్వ పరంగా, దేవదాయ శాఖ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను విజిలెన్స్‌ అధికారులకు అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు