రైతు దీక్షను విజయవంతం చేద్దాం

23 Jan, 2015 05:03 IST|Sakshi
రైతు దీక్షను విజయవంతం చేద్దాం

తాడేపల్లిగూడెం : చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలిచ్చి రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను తీవ్ర ఇక్కట్ల పాలు చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) విమర్శించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ నివాసంలో ఆయన పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడారు. రైతుల బాధలు తీర్చడానికి, వారిలో భరోసా కల్పించి, వారి పక్షాన పోరు చేయడానికి ఈనెల 31, ఫిబ్రవరి ఒకటో తేదీన తణుకులో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  రైతు దీక్ష చేపడుతున్నారన్నారు.
 
 వివిధ రూపాలలో ఇబ్బందులు పడుతున్న వారికి స్వాంతన చేకూర్చే విధంగా జిల్లాలో జరుగుతున్న దీక్షను పార్టీ శ్రేణులు, ప్రజలు విజయవంతం చేయాలన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి మాట్లాడుతూ అబద్దాల వాగ్దానాలతో ఎన్నికల సమయంలో ప్రజలు నిలువునా ముంచిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కిందని, రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ హామీతో సీఎం మోసం చేశారని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడటంలో ఎప్పుడూ ముందుండే జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో చేపట్టే రైతు దీక్షను విజయవంతం చేయాలని, నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు కదిలిరావాలని కోరారు. పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు యెగ్గిన నాగబాబు, జిల్లా కమిటీ సభ్యులు రాజా త్రినాథ్ పాల్గొన్నారు.   
 
 జిల్లాలో పార్టీ బలాన్ని నిరూపించాలి
 ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని నిరూపించడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త చొరవ చూపాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని పిలుపునిచ్చారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1 తేదీల్లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనరెడ్డి తణుకులో నిర్వహించనున్న రైతు దీక్షను విజయవంతం చేసే అంశంపై నగరంలోని పార్టీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు రామచంద్రరావు నివాసంలో గురువారం ఆ నియోజకవర్గ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
 
  ప్రతిపక్ష నేతగా రైతుల రుణమాఫీ అమలు చేయించడం కోసం ప్రభుత్వంతో బహిరంగ పోరాటానికి దిగిన ఏకైక నాయకుడు జగన్‌మోహనరెడ్డి అన్నారు. ప్రతిపక్ష నాయకునిగా తొలిసారి చేస్తున్న రైతు దీక్షకు జిల్లాను వేదికగా ఎంచుకోవడం ఆయనకు జిల్లా ప్రజలపై ఉన్న అపార నమ్మకమే కారణమన్నారు. దీక్షను జయప్రదం చేయాలని, దీనిపై రైతుల్లో, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కార్యకర్తలను కోరారు. ముఖ్యనాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాయకులు కొఠారు రామచంద్రరావు, అప్పన ప్రసాద్, ఘంటా ప్రసాదరావు, మెట్టపల్లి సూరిబాబు, అక్కినేని సతీష్, మొరవనేని భాస్కరరావు, ఎంవీఎస్‌ఎన్ ప్రసాద్ (జానంపేట బాబు), చల్లగుళ్ళ తేజ, వీవీఎంజీహెచ్ కే ప్రసాద్ (మున్ని), తేరా ప్రసాద్, అబ్బదాసు సౌరి, చల్లారి సత్యనారాయణ, పొన్నూరి సత్యనారాయణ, షేక్ బుజ్జి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు