రేపు ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం ప్రారంభం
సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా, నిరుపేదలకు అండగా దేశంలోనే వినూత్న కార్యక్రమం
ఈ ఏడాది బడ్జెట్లో రూ. 6500 కోట్లు కేటాయింపు
నేరుగా తల్లులకు నగదు బదిలీ
తల్లి మరణిస్తే సంరక్షుడికి నగదు
రేపు చిత్తూరులో ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్
పూర్తి సంతృప్తస్థాయిలో పథకం.. దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ది
హామీ ఇచ్చిన దానికంటే మిన్నగా పథకం అమలు
ఇంటర్మీడియట్ చదవుతున్న విద్యార్థుల తల్లులకూ వర్తింపు
అన్ని ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు వర్తింపు
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలకూ వర్తింపు
ఘనంగా అమ్మ ఒడి పథకం కార్యక్రమం ప్రారంభానికి ఏర్పాట్లు
సాక్షి, అమరావతి : ‘నేను విన్నాను, నేను చూశాను, నేను ఉన్నాను’ అంటూ చెప్పిన ప్రతీ మాట నిజం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. మాట ఇచ్చారంటే నెరవేర్చడమే లక్ష్యంగా ప్రతీ అడుగూ ముందుకేస్తున్నారు. అందులో భాగంగానే నవరత్నాలలో మరో కీలక హమీని నెరవేర్చేందుకు రంగం సిద్దమైంది. చదువుకు పేదరికం ఎప్పుడూ ఆటంకం కాకూడదన్న గొప్ప ఆలోచనతో సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన అమ్మఒడి కార్యక్రమం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న అమ్మఒడి’ కార్యక్రమాన్ని గురువారం చిత్తూరులో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు
భారీగా నిధులు.. 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం
అలాగే ఈ పథకానికి ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. ‘జగనన్న అమ్మఒడి’ పథకం నవరత్నాల్లో చాలా కీలకమైనదన్న సంగతి తెలిసిందే. పిల్లలను బడికి పంపే ప్రతి అమ్మ బ్యాంక్ అకౌంట్లో సంవత్సరానికి రూ.15వేలు వేస్తామని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మహిళలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల విద్యార్థులకు అమలు చేయాలని భావించినా.. తరువాత ఇంటర్ వరకు వర్తింపజేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది తల్లులకు ప్రయోజనం చేకూరనుంది.
ఏ ఒక్క చిన్నారి బడికి దూరం కాకూడదని..
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క చిన్నారి బడికి దూరం కాకూడదన్న ఆశయంతో సీఎం వైఎస్ జగన్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. ప్రస్తుతం బడ్జెట్లో ఈ పథకానికి ఏకంగా రూ.6,500 కోట్లు కేటాయించారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రయివేట్ జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా జనవరిలో నేరుగా అన్ ఇంకబర్డ్ బ్యాంక్ అకౌంట్లలో ఈ మొత్తాన్ని జమచేయనున్నారు. ఈ పథకం వల్ల డ్రాపౌట్లు తగ్గనున్నాయి. పేద కుటుంబంలోని ప్రతి పిల్లాడికి విద్య అందడం ద్వారా ఆయా కుటుంబాలు వృద్ది చెందుతాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వారోత్సవాలు రేపటితో ముగియనున్నాయి.
వారోత్సవాల చివరి రోజు(జనవరి 9) నిర్వహించే కార్యక్రమాల వివరాలు..
చిత్తూరులో సీఎం వైఎస్ జగన్ పర్యటన వివరాలు..
► ఉదయం 9 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు.
► 11.15 గంటలకు చిత్తూరు పీవీకేఎన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్ సభా ప్రాంగణం వద్దకు సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు.
► 11.15 -11.35 : పాఠశాల విద్యాశాఖ ఏర్పాటుచేసిన స్టాల్స్ను సీఎం వైఎస్ జగన్ పరిశీలిస్తారు.
► 11.35 -11.40 : స్ధానిక అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్ధాపన కార్యక్రమాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు.
► 11.45- 1.45 : అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనున్న సీఎం వైఎస్ జగన్.. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
► తిరిగి 3.45 గంటలకు సీఎం తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.