పేద పిల్లల చదువుకు సర్కారు అండ

15 Nov, 2019 05:47 IST|Sakshi

ప్రభుత్వ పాఠశాలలను మెరుగు పరిచేందుకు రూ.12 వేల కోట్లు 

మనబడి నాడు–నేడు ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ 

గత ప్రభుత్వం చివరి ఏడాది కేటాయించింది రూ.20 కోట్లే

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వర్సిటీ ఏర్పాటు

విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఖర్చులకు ఏటా రూ.20 వేలు

ఐదు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు

జనవరి 9న అమ్మఒడి   

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘చదువులకయ్యే ఖర్చు తట్టుకోలేక, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన చదువులు లేవని బాధపడుతున్న పరిస్థితులు నా కళ్లతో స్వయంగా చూశా. నేను చూశాను.. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అని పాదయాత్రలో చెప్పాను. ఆ మాట మేరకు ఇప్పుడు మార్పు దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాను’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఒంగోలులోని పీవీఆర్‌ మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన  విద్యార్థులు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు.  

నాడు– నేడు చరిత్రలో నిలిచిపోతుంది
ఈ రోజు నాడు– నేడు కార్యక్రమం నిజంగా చరిత్రలో నిలిచిపోయేది. రాష్ట్రంలో 45 వేల పై చిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిని మూడేళ్లలో మూడు దశల్లో బాగు చేసే కార్యక్రమం చేస్తున్నాం. మొదటి దశ ఈ రోజు ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది జూన్, జూలై నాటికి 15,715 స్కూళ్లలో రూ.3,500 కోట్లతో మరుగుదొడ్లు, తాగునీరు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, నాణ్యమైన ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డు, మంచి రంగులు ఉంటాయి. ఆ మేరకు మరమ్మతులు చేస్తాం. అవసరమైన మేరకు తరగతి గదులు, కాంపౌండ్‌ వాల్స్, ఇంగ్లిష్‌ ల్యాబ్‌లు వస్తాయి. ఇలా తొమ్మిది రకాల మౌలిక వసతులు కల్పిస్తాం.


మార్పు చూపిస్తాం
ఒక చిన్నారి ఇంతకు ముందు మాట్లాడుతూ.. అన్నా.. మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి. చేయగలవా..? అని అడిగింది. మంచి మనసుతో అడుగులు వేస్తే పైన దేవుడున్నాడు.. ప్రజల దీవెనలు ఉన్నాయి. ముందడుగు వేస్తానని చెబుతున్నా. అన్ని చాలెంజ్‌లను అధిగమిస్తాను. ఇవాళ నాడు– నేడు కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ 15,715 బడుల ఫొటోలు తీస్తాం. వాటిని బడి ముందే అతికిస్తాం. జూన్, జూలై మాసం కల్లా మార్పు చేసిన తర్వాత ఎలా ఉంటాయో పక్కనే ఫొటో పెట్టి చూపిస్తాం. మన పిల్లలను చదివించాలంటే ఏం చేయాలనే ఆలోచనతోనే ముందడుగు వేశా.

జనవరి 9వ తేదీన ‘అమ్మ ఒడి’
‘అమ్మ ఒడి’కి జనవరి 9న శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రతి తల్లికి చెబుతున్నా.. మీ అన్నగా, మీ తమ్ముడిగా మాట ఇస్తున్నా. మీ పిల్లలను బడికి పంపించండి చాలు. సంవత్సరానికి రూ.15 వేలు మీ చేతిలో పెడతాను. బడులకు మరమ్మతులు చేస్తున్నాం. ఇంగ్లిష్‌ మీడియం తీసుకొస్తున్నాం. మన బతుకులు మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  

ఉన్నత చదువులు, కొలువుల దిశగా..
►ఇంటర్‌ తర్వాత ఎంత మంది డిగ్రీ, ఇంజనీరింగ్‌ చదువుతున్నారని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతోంది. కేవలం 24 శాతం మంది మాత్రమే ఆ పై చదువులు చదువుతున్నారని  గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) చెబుతోంది. ఈ పరిస్థితిని మారుస్తాం.
►పేదల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొస్తున్నాం. ఇది కాకుండా హాస్టళ్లలో మెస్‌ చార్జీల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తాం.
►ఇంజనీరింగ్, డిగ్రీ చదువుల్లో ఏడాది అప్రెంటీస్‌ తప్పనిసరి చేస్తున్నాం.
►ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌. వీటన్నింటినీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌  వర్సిటీతో అనుసంధానం.  
►పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే.
►ఐదు నెలల్లో అక్షరాలా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. అందులో 1.30 లక్షల ఉద్యోగాలు గ్రామ సచివాలయాల్లో ఇచ్చాం.►పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయని తెలిసినా గత ఏడాది అప్పటి ప్రభుత్వం కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయించింది. 45 వేల స్కూళ్లను బాగు చేయడానికి ఈ నిధులు ఏమాత్రం సరిపోతాయి? మన ప్రభుత్వం వచ్చాకా 45 వేల స్కూళ్లను బాగు చేసేందుకు మూడేళ్లలో రూ.12,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించాం.
– సీఎం జగన్‌

>
మరిన్ని వార్తలు