సాక్షి, రామచంద్రాపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 204వ రోజు వర్షం కారణంగా ఈ రోజు మధ్యాహ్నానికి వాయిదా పడింది. సాయంత్రం ద్రాక్షారామంలో జరగాల్సిన సభ రేపటికి వాయిదా పడిందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రాఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని కాజులూరు మండలం కోలంక శివారు నుంచి జననేత ఈ రోజు మధ్యాహ్నం పాదయాత్ర కొనసాగించనున్నారు.
ఇప్పటి వరకు వైఎస్ జగన్ 2,474.7 కిలో మీటర్లు నడిచారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర గోదావరి జిల్లాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి వరుణుడు తరచుగా పలకరిస్తున్నాడు. గత రెండు రోజులుగా చిరుజల్లుల మధ్య వైఎస్ జగన్ పాదయాత్ర సాగించారు. గత రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తుండటంతో పాదయాత్రను మధ్యాహ్నానికి వాయిదా వేసుకున్నారు.