బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం

22 Aug, 2014 14:02 IST|Sakshi
బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం

హైదరాబాద్: రాజకీయ హత్యలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అట్టుడికింది. హత్యారాజకీయాలపై చర్చ వాడివేడిగా జరిగింది. రాష్ట్రంలో శాంతిభద్రతలపై సభలో చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టడంతో స్పీకర్ అంగీకరించారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలు సభలో గందరగోళానికి కారణమయ్యాయి.

పలువురు నేరస్థులతో వైఎస్ జగన్ కు సంబంధాలున్నాయని బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. దీనిపై వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. బుచ్చయ్య చౌదరి అడ్డుతగలడంతో.. చెప్పేది వినలేని మీరు- చేయని తప్పులకు ఆరోపణలు చేస్తే ఎలా ఊరుకుంటానంటూ సమాధానమిచ్చారు. తనపై బురద చల్లడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారిందంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు టీడీపీ సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం రేగింది. దీంతో సభను కోడెల శివప్రసాదరావు పది నిమిషాల పాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత గందరగోళం కొనసాగడంతో శనివారానికి వాయిదా పడింది.

మరిన్ని వార్తలు