ప్రణబ్‌ ‘భారతరత్న’ ఆనందదాయకం

25 Jan, 2019 22:29 IST|Sakshi

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి భారతరత్న అవార్డు లభించ డం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రణబ్‌ ఈ అవార్డుకు అన్నివిధాలా అర్హుడన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రణబ్‌ ముఖర్జీ రాజనీతిజ్ఞతను ప్రదర్శించారని ప్రశంసించారు.

ప్రఖ్యాత గాయకుడు భూపేన్‌ హజారికా, ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త నానాజీ దేశ్‌ముఖ్‌కు మరణానంతరం భారతరత్న గౌరవం దక్కడంపై జగన్‌ సంతోషం వ్యక్తం చేశారు. పద్మ పురస్కారాలను పొందిన తెలుగువారికి జగన్‌ అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే అంతరిక్ష పరిశోధనలో మరో ముందడుగు వేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్‌ జగన్‌ శుక్రవారం అభినందనలు తెలిపారు.  

ప్రణబ్‌ముఖర్జీకి భారతరత్నపై కేసీఆర్‌ హర్షం 
సాక్షి, హైదరాబాద్‌: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ పురస్కారానికి ప్రణబ్‌ ముఖర్జీ పూర్తి అర్హుడని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టపరచడానికి, రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రణబ్‌ ముఖర్జీ తీసుకున్న చొరవను దేశం ఎన్నటికీ మరవబోదన్నారు. రాజనీతిజ్ఞుడిగా.. రచయితగా, దౌత్యవేత్తగా, పాలనాదక్షుడిగా ప్రణబ్‌ జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు