జగన్‌ రాక.. ఆశల కేక!

4 Jun, 2019 12:44 IST|Sakshi

రూ. 3 వేల నుంచి రూ. 10 వేలకు పెరిగిన కార్యకర్తల వేతనాలు

సమస్యలను ప్రత్యక్షంగా గమనించిన సీఎం జగన్‌

వేతనాల పెంపుపై ఆశ కార్యకర్తల్లో సర్వత్రా హర్షం

పర్చూరు:  ఎప్పటి నుంచో వేతనాల పెంపు కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆశ కార్యకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీపి కబురు అందించారు. మూడు వేల రూపాయల వేతనంతో కుటుంబ పోషణను భారంగా నెట్టుకొస్తున్న ఆశ కార్యకర్తలు గత ప్రభుత్వ కాలంలో అనేక పోరాటాలు చేశారు. రోడ్లెక్కారు.. ధర్నాలు చేశారు.. విధులు బహిష్కరించారు. అన్ని రకాలుగా తమ నిరసనను వ్యక్త పరిచారు. చివరకు ప్రతి పక్ష నేత హోదాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కేవలం ఒక్కో సేవకు ఒక్కో రేటును నిర్ణయించి వేతనాలు లెక్కకట్టేవారు. దీంతో చాలీచాలని వేతనంతో అవస్థలు పడుతున్న ఆశ కార్యకర్తలకు జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలను రూ. 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆయన ప్రకటించిన విధంగా అధికారం చేపట్టిన వారంలోనే వారి వేతనాలను రూ. 3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ వైద్యశాఖాధికారుల సమీక్షలో ప్రకటన చేశారు. విషయాన్ని తెలుసుకున్న ఆశ కార్యకర్తలు ఆనందోత్సహాలను జరుపుకుంటూ తమ ఆనందాన్ని తెలుపుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

మేము ఊహించలేదు
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల్లోనే మా గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని మేము ఊహించలేదు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఇంత మంచి నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది.        – విజయలక్ష్మి, ఆశ కార్యకర్త (ఇడుపులపాడు

మరిన్ని వార్తలు