ఆర్థిక సంఘం చైర్మన్‌తో సీఎం జగన్‌ భేటీ

19 Dec, 2019 16:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌ నేతృత్వంలోని బృందంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆర్థిక సాయం పెంచాలని సీఎం కోరారు. అదే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి తగు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్రానికి అవసరమైన ఆర్థిక సాయానికి.. ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుందన్న విషయం తెలిసిందే.

రాష్ట్రాన్ని గత సర్కారు ఆర్థికంగా దివాళా ఎలా దివాళా తీయించిందో వివరించడంతో పాటు... ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, అక్షరాస్యత పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, విద్య వైద్య రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, మహిళలు, పిలల్లో పౌష్టికాహార లోపం నివారణకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి జగన్‌ 15వ ఆర్థిక సంఘానికి సమగ్రంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆవశ్యకతలను ఆర్థిక సంఘం దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని రాజ్యసభలో ఏపీకి ప్రకటించిన ‘ప్రత్యేక హోదా’ హామీ ఇప్పటికీ నెరవేరలేదని రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ఆర్థిక సంఘం దృష్టికి తీసుకువెళ్లింది.


 

>
మరిన్ని వార్తలు