సంక్షేమబాటలో ‘తూర్పు’

30 May, 2020 12:18 IST|Sakshi

ఓ వైపు అభివృద్ధి.. మరో వైపు సంక్షేమం  

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి స్తంభించినా పథకాలకు నిధుల మంజూరు  

పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పెంపు  

కాళ్లవాపు బాధితులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం 

వైఎస్సార్‌ సీపీ సర్కారు పాలనకు ఏడాది పూర్తి  

సాక్షి, కాకినాడ: ‘తూర్పు’లో ప్రజా సంక్షేమానికి బాటలు పడ్డాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90 శాతం హామీలు అమలు చేసి చరిత్ర సృష్టించింది. కోవిడ్‌–19 వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్రం లాక్‌డౌన్‌ విధించడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అయినా వాటిని లెక్క చేయకుండా ప్రజా సంక్షేమం దిశగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్రెడ్డి అడుగులు వేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే.. హామీలు ఇవ్వని పథకాలను సైతం ఆచరణలోకి తీసుకొచ్చిన ఘనత జగన్‌కే దక్కింది. ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధికి బాట వేస్తూ ఆదర్శంగా నిలిచారు. ఏ సంక్షేమ పథకం తీసుకున్నా క్షేత్ర స్థాయికి వాటి ఫలాలు చేరేలా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను నెలకొల్పారు. పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ గతంలో ఒక్కో రైతుకు రూ.6.5 లక్షలు ప్రకటించగా..ప్రస్తుతం  దాన్ని రూ.10 లక్షలకు పెంచారు. ఏజెన్సీలో కాళ్లవాపుతో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.70 లక్షల ఆర్థిక సాయం ప్రకటించి మనసున్న నేతగా నిలిచారు. (వాళ్ల కష్టాలు విన్నా.. చూశా: సీఎం జగన్‌)

అన్నదాతకు అండగా..
రైతులకు తానున్నాన్న భరోసా ఇచ్చేందుకు రైతు భరోసా పేరుతో ఓ బృహత్తర పథకానికి నాంది పలికారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.13,500 పంట సాగుకు పెట్టుబడి కింద అందజేస్తున్నారు. జిల్లాలో 4,29,676 మంది రైతులు ఉండగా.. వారికి ఈ ఏడాది రూ.322.25 కోట్లు చెల్లించారు. గతేడాది 4.12 లక్షల కుటుంబాలకు రూ.311.52 కోట్లు చెల్లించారు. గతేడాదికంటే ఈ ఏడాది 17,391 మందికి అదనంగా చెల్లించారు.మత్స్యకార భరోసా : ఏప్రిల్‌ 14 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు సముంద్రంలో వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకారులు ఉపాధికి దూరమవుతారు. వారికి వేట నిషేధ భృతి చెల్లిస్తున్నారు. జిల్లాలో 24 వేల మంది సముద్రంలో వేటకు వెళ్లనున్నట్లు అధికారులు గుర్తించారు. వారికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.24.58 కోట్లు పరిహారంగా అందించారు. 
గతేడాదిలో 22 వేల మందికి రూ.22 కోట్లు చెల్లించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 20 రోజుల్లో నగదు చెల్లించడం ఇదే తొలిసారి.
(జ(గ)న్‌ రంజక పాలనకు ఏడాది)

అమ్మ ఒడి:
నిరుపేదలు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకు దూరం కాకూడదన్న తలంపుతో అమ్మ ఒడి పథకం ద్వారా ఆర్థికసాయం అంజేస్తున్నారు. పాఠశాలకు వెళ్లే ఒక్కో విద్యారి్థకి ఏడాదికి రూ.1500 చొప్పున వారి తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6,020 పాఠశాలలుండగా..4,57,222 మంది విద్యార్థులకు అర్హులుగా గుర్తించి రూ.685.83 కోట్లు జమ చేశారు. 

వాహనమిత్ర: వాహనమిత్ర పథకం పేరుతో ఏటా రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 25,745 మందికిగాను రూ.2,57,45,000 కోట్లు అందజేశారు. వచ్చే నెలలో రెండో విడత సొమ్ము కూడా అందించనున్నారు.
 
జగనన్న విద్యా, వసతి దీవెన 
జగనన్న వసతి దీవెన పథకంలో భాగంగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 1,12,320 మందికిగాను రూ.117.73 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. రెండో విడతలో భాగంగా జగనన్న వసతి దీవెనకు 18,809 మందికి రూ.17.56 కోట్లు, విద్యా దీవెనకు 18,618 మంది విద్యార్థులకు రూ.38.75 కోట్లు చెల్లించనున్నారు.  

అభాగ్యులకు అండ 
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అభాగ్యులకు అండగా నిలుస్తోంది. 1వ తేదీనే ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 6,35,973 మందికి రూ.154 కోట్లు అందజేస్తోంది. అది ఒక్క రోజులోనే గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా పంపిణీ నిర్వహిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో 5,80,432 మందికి వివిధ రకాలు పింఛన్లు మంజూరు చేస్తుండగా..వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 6,35,973 మంది ఇస్తున్నారు. గత ప్రభుత్వం కంటే ప్రస్తుతం 55,541 మందికి కొత్తవారికి అవకాశం కల్పించారు.

మరిన్ని వార్తలు