ఎన్నికల సమయంలో ప్రతిరోజూ ఓట్ల కోసం వచ్చిన టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్లుగా ముఖం చాటేస్తున్నారని పలువురు బాధితులు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయారు. నిత్యం సమస్యలతో సావాసం చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాతపట్నం, పలాస నియోజకవర్గాల్లో శనివారం జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రతిపక్ష నేతను కలిసి తమ గోడు విన్నవించారు. – ప్రజా సంకల్పయాత్ర బృందం
శ్రీకాకుళం అర్బన్: వంశధార నదీతీరప్రాంతంలో ఎల్.ఎన్.పేట మండలంలోని ఎనిమిది గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, ఆ సమస్య లేకుండా కరకట్టల నిర్మాణం చేపట్టాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వంశధార కరకట్టల నిర్మాణం కోసం రూ.90 కోట్లు నిధులు కేటాయించారని, అయినా పనులు జరగలేదన్నారు.
మరోసారి రూ.320కోట్లు అంచనాలతో నిధులు కేటాయించారు తప్ప పనులు ప్రారంభించలేదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కరకట్టలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు తప్ప ఆచరణలో మాత్రం విఫలమయ్యారని చెప్పారు. కరకట్టల నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. జగన్ను కలిసిన వారిలో ఎల్.ఎన్.పేటకు చెందిన ఎం.రవికుమార్, కొల్ల రాము, రావిచంద్రి, కె.కృష్ణారావు, తూలుగు కృష్ణారావు, ఎర్ర జనార్దనరావు, మహంతి సింహబలుడు తదితరులు ఉన్నారు.