జిల్లాలో నేటి నుంచి వైఎస్ జగన్ ‘ప్రజా సంకల్పయాత్ర’
చాగలమర్రి సమీపంలో ప్రారంభం
ముత్యాలపాడు బస్టాండ్ సమీపంలో బహిరంగసభ, గొడిగనూరులో జెండావిష్కరణ
కష్టాల్లో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పడానికి..
నష్టాల్లో కూరుకుపోయిన రైతన్నల్లో
మనోధైర్యం నింపడానికి..
‘ఆసరా’ కరువైన అవ్వాతాతలకు
అండగా నిలవడానికి..
పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న దళితులు,
బడుగులకు భరోసానివ్వడానికి..
చదువు సాఫీగా సాగక సతమతమవుతున్న
పేదింటి బిడ్డల కష్టాలను తెలుసుకోవడానికి..
ఉద్యోగులు, నిరుద్యోగుల బాధలు వినడానికి..
ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేని
సర్కారు తీరును ఎండగట్టడానికి..
అన్న వస్తున్నాడు.. జగనన్న వస్తున్నాడు...
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మంగళవారం జిల్లాలో ప్రారంభమవుతోంది. ఇప్పటికే వైఎస్సార్ జిల్లాలో పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయ్యింది. సోమవారం రాత్రి 7.45 గంటలకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి సమీపంలోని ఎస్ఎస్ ధాబా ప్రాంతానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం 8.30 నుంచి జిల్లాలో పాదయాత్ర ప్రారంభిస్తారు. ముందుగా
చాగలమర్రి గ్రామానికి చేరుకుంటారు. స్థానిక ముత్యాలపాడు బస్టాండు సెంటర్లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి శెట్టివీడు మీదుగా గొడిగనూరుకు చేరుకుని.. పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. తర్వాత ముత్యాలపాడు మీదుగా చక్రవర్తులపల్లెకు చేరుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
పార్టీ శ్రేణులు సర్వసన్నద్ధం
ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేయడానికి వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు. జగన్కు భారీ స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పార్టీ నాయకులు చెప్పారు. జిల్లాలోని నాయకులు, ప్రజలందరూ ప్రజా సంకల్పయాత్రకు మద్దతు పలకాలని కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లాల పార్టీ అధ్యక్షులు బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు.
స్వాగతం పలికిన జిల్లా నాయకులు
చాగలమర్రి: వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రగా సోమవారం రాత్రి 7.45 గంటలకు చాగలమర్రి సమీపానికి చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి, నంద్యాల పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి, సీనియర్ నేత గౌరు వెంకట్రెడ్డి, మండల నాయకులు బాబులాల్ తదితరులు స్వాగతం పలికారు.