హైదరాబాద్ : ఈ నెల 26న హైదరాబాద్లో జరగనున్న సమైక్య శంఖారావం సభకు సంబంధించిన ఏర్పాట్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న నేతల అభిప్రాయాలను, సూచనలు ఆయన అడిగి తెలుసుకున్నారు. సమైక్య సభకు భారీగా తరలి వచ్చే సమైక్యవాదులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని జగన్ ఈసందర్భంగా నేతలకు సూచించారు.
మరోవైపు రాష్ట్ర సమైఖ్యత కోసం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం వృధాగా పోరాదని తిరుపతి ఎస్వీయూ విద్యార్థులు స్పష్టం చేశారు. జగన్ తరహాలోనే ఇతర పార్టీల నేతలు కూడా సమైక్యాంధ్ర కోసం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులో జరగనున్న సమైఖ్య శంఖారావం సభకు తిరుపతి నుంచి వేలాదిగా విద్యార్థులు తరలి వెళతామని స్పష్టం చేశారు. సమైఖ్య శంఖారావానికి మద్దతుగా తుడా సర్కిల్లో విద్యార్థులు దీక్ష చేపట్టారు.
ఈ నెల 26న హైదరాబాద్లో జగన్ తలపెట్టిన సమైక్య శంఖారావానికి కులవృత్తుల వారు భారీగా తరలి రావాలని మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. వరదు కళ్యాణి ఆధ్వర్యంలో శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో రైతులు, రజకులు, వడ్రంగిలు, చేనేత కార్మికులు, కులవృత్తుల వారు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన వలన సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే గత మూడు నెలలుగా సీమాంధ్ర ప్రాంతం ఆందోళనలతో అట్టుడికిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరింత రెచ్చగొట్టే ధోరణి లో వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.