గ‌మ్యానికి చేరేవ‌ర‌కు యాప్ ద్వారా ట్రాక్‌

10 May, 2020 16:32 IST|Sakshi

విమానాశ్రయాల నుంచి క్వారంటైన్ కేంద్రాల‌కు ఉచిత‌ బ‌స్సు సౌక‌ర్యం

11 చెక్‌పోస్టుల ద్వారా రాష్ట్రంలోకి ప్ర‌వేశం

లాక్‌డౌన్ అనంత‌రం ప్రోటోకాల్‌పై చ‌ర్చ‌

సాక్షి, అమరావతి: అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 7 గంటలకూ దుకాణాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నందున ఆమేరకు దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు. క‌రోనా వైర‌స్‌పై సీఎం జ‌గ‌న్‌ తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వ‌హించారు. వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్ ‌రాష్ట్రంలో కోవిడ్‌‌ పరిస్థితులను వివరించారు. ఇతర రాష్ట్రాల్లోని ఏపీకి చెందిన వలస‌ కార్మికులు, అలాగే రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల అంశాలపై సీనియర్‌ అధికారి కృష్ణబాబు వివరాలు అందించారు. విదేశాల్లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన వారు రేపటినుంచి రావటం మొదలవుతుంద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా అధికారులు వెల్ల‌డించిన వివ‌రాలు, సీఎం ఆదేశాలు ఇలా ఉన్నాయి.

ఉచిత బస్సు సౌకర్యం
► అమెరికా నుంచి వచ్చేవారు వైజాగ్, విజయవాడ, తిరుపతే కాకుండా ముంబై, హైదరాబాద్, చెన్నైలాంటి విమానాశ్రయాలకూ చేరుకుంటారు.
► సీఎం జ‌గ‌న్‌ ఆదేశాల ప్రకారం వీరికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉచితంగానే అన్ని వసతులు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
► విమానాశ్రయాల నుంచి క్వారంటైన్‌ కేంద్రాలకు చేరడానికి ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశించారు.
► ఇతర రాష్ట్రాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి వస్తున్నవారికి ఏ రాష్ట్రం కూడా ఇంతలా సదుపాయాలను ఏర్పాటు చేయడంలేదన్నారు. వారు తిరిగి రావటానికి తగిన విధంగా సహాయసహకారాలు అందిస్తున్నామన్నారు. (డిశ్చార్జ్‌లు పెరుగుతున్నాయి)

యాప్ ‌ద్వారా ట్రాక్
► మొత్తంగా వివిధ రాష్ట్రాలనుంచి 11 చెక్‌పోస్టుల ద్వారా ఏపీలోకి ప్రవేశిస్తారని అధికారులు చెప్పారు.
► రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి పొందిన గమ్యానికి చేరుకోవడం వరకూ యాప్ ‌ద్వారా ట్రాక్‌ చేస్తామన్నారు.
► ఆ తర్వాత వారి వివరాలను ఆ గ్రామంలో ఉన్న వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్త, అలాగే ప్రతి సచివాలయంలో ఉన్న హెల్త్‌ అసిస్టెంట్‌కు చేరవేయాలని సీఎం పేర్కొన్నారు.
► హోం క్వారంటైన్‌ పాటించేలా చేయడం, తర్వాత పరీక్షలు చేయించడం తద్వారా వారికి కావాల్సిన వైద్య సదుపాయాలు, ఆస్పత్రికి తరలించడం లాంటి కార్యక్రమాలు కొనసాగేలా చూడాలన్నారు.

లాక్‌డౌన్‌ అనంతరం అనుసరించాల్సిన హెల్త్‌ప్రోటోకాల్‌ అంశంపై చర్చ
► రాష్ట్రంలో ఒక్క ల్యాబ్‌తో ప్రారంభమైన కోవిడ్‌–19 నివారణా చర్యల ప్రయాణం.. ఇవ్వాళ దేశంలోనే అత్యధిక పరీక్షలు చేసే స్థాయికి చేరుకున్నామని, చాలా గట్టిగా పనిచేసి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలుగుతున్నామని సమావేశంలో చర్చకు వ‌చ్చింది.
► లాక్‌డౌన్‌ అనంతరం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి కదలిక ప్రారంభమైతే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎలాంటి ప్రోటోకాల్‌ పాటించాలన్న దానిపై విస్తృతంగా చర్చ జ‌రిగింది.
► ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుంచి ఏపీలోకి అడుగుపెట్టేటప్పుడు ఎలాంటి వైద్య పరిశీలన, పరీక్షలు చేయాలి? తర్వాత ఆ వ్యక్తి అనుసరించాల్సిన ఐసోలేషన్‌ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఒక ప్రోటోకాల్‌ తయారు చేయాలని సీఎం జ‌గ‌న్ అధికారులను ఆదేశించారు.
► కేంద్ర ప్రభుత్వం హోం క్వారంటైన్‌ సహా, క్వారంటైన్‌ నుంచి పంపించేటప్పుడు అనుసరించాల్సిన ప్రోటోకాల్‌పై మార్గదర్శకాలు విడుదల చేసింద‌ని అధికారులు తెలిపారు.
► ఇవి దిగువ స్థాయిలో ప్రయోగాత్మకంగా అమలుచేసి.. ఆ విధానాల బలోపేతానికి కృషిచేయాలని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ సూచించారు. ప్రజల్లో భయాన్ని పోగొడుతూ.. భౌతిక దూరం లాంటి జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, తద్వారా వైరస్‌తో సమర్థవంతంగా పోరాడగలమన్నారు. వీటన్నింటికీ సంబంధించి స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొజీజర్స్‌ సిద్ధంచేయాలని అధికారులను ఆదేశించారు. (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం)

మరిన్ని వార్తలు