ముస్లింలపై చం‍ద్రబాబు కపట ప్రేమ : వైఎస్‌ జగన్‌

12 Sep, 2018 18:19 IST|Sakshi
ముస్లిం ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

విశాఖలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం

సాక్షి, విశాఖపట్నం : ఎన్నికల సమయంలో చం‍ద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం అనేక హామీలిచ్చి వాటన్నింటినీ తుంగలో తొక్కారని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విమర్శించారు. దేశంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేని క్యాబినెట్‌ ఏదైనా ఉందంటే అది కేవలం చంద్రబాబు ప్రభుత్వమేనని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా బుధవారం విశాఖపట్నంలోని ఆరిలోవ బీఆర్‌టీఎస్‌ రోడ్డులో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది.

ఈ  సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధికారంలోని రాగనే ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కార్పొరేషన్‌ ద్వారా రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో కార్పొరేషన్లు పూర్తిగా అవినీతిమయంతో కూడి ఉన్నాయని.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్పొరేషన్‌ వ్యవస్థను పూర్తిగా ప్రక్షళణ చేస్తామన్నారు. టీడీపీ పాలనలో ముస్లింలు అత్యంత వెనుకబడి ఉన్నారని.. కేవలం ఎన్నికల సమయంలోనే ఆయనకు ముస్లింలు గుర్తుకు వస్తారని వైఎస్‌ జగన్‌ విమర్శించారు. ఎన్నికల్లో భాగంగానే ఇటీవల గుంటూరులో ‘నారా హమారా.. ముస్లిం హమారా’ అనే కార్యక్రమం పెట్టారని మండిపడ్డారు. ముస్లింలకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం ఎందుకు లేదని ప్రశ్నించిన ముస్లిం పిల్లలపై అన్యాయంగా అక్రమ కేసులు పెట్టించారని ధ్వజమెత్తారు.

సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్‌ దుల్హన్‌ పథకం ద్వారా వివాహ సమయంలో ప్రతీ ఆడబిడ్డకు లక్ష రూపాయాలు సహాయం చేస్తాం. వైఎస్సార్‌ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి వారిని ఆదుకున్నారు. పేద ముస్లిం పిల్లలకు కేజీ టూ ఉచిత విద్యను అందించారు. 2014లో ఎన్నికల సమయంలో ముస్లింల సంక్షేమం కోసం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. కానీ నాలుగేళ్ల కాలంలో ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయారు. 2017-18 బడ్జెట్‌లో ముస్లింల సంక్షేమం కోసం 850 కోట్లు  కేటాయించారు. కానీ కేవలం 350 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా అనేక అబద్దాపు వాగ్దానాలు ఇచ్చారు. ముస్లింలకు ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసి వాటి ద్వారా ముస్లింలకు రుణాలు మంజూరు చేస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ నాలుగేళ్లయినా ఇంత వరకూ ఏర్పాటు చేయలేదు. ఫాతిమా మెడికల్‌ కాలేజ్‌ విద్యార్ధులను అత్యంత ఘోరంగా మోసాం చేశారు. కాలేజీ ఫీజుల కడతామని హామీ ఇచ్చి తరువాత మోహం చాటేశారు. చం‍ద్రబాబు పాలనలో ముస్లిం బాలికలపై అత్యాచారాలు జరుతున్నా పట్టించుకోవడం లేదు. న్యాయం చేయండని పోరాడిన వాళ్లపై అక్రమంగా కేసులు పెడుతున్నారు’’ అని జగన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు