జగన్ పర్యటన విజయవంతం చేయండి

11 Nov, 2013 01:07 IST|Sakshi
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ఈనెల 13న జిల్లాలో జరిపే పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఐ.వి. సత్యనారాయణ, డీసీసీబీ డెరైక్టర్ ఇళ్ల గోపాలకృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతు గోవిందశెట్టితోపాటు మండలానికి చెందిన ఏడుగురు సర్పంచ్‌లు, వెయ్యిమంది  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చిట్టబ్బాయి మాట్లాడుతూ జగన్‌మోహన్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారిగా మన జిల్లా నుంచే రాష్ట్ర పర్యటన ప్రారంభిస్తున్నారన్నారు. 
 
 ఈనెల 13న మధురపూడి విమానాశ్రయంలో దిగి రాజమండ్రి, రామచంద్రపురం నియోజకవర్గాల్లో జగన్ పర్యటిస్తారన్నారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు అపూర్వస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.  సమైక్యాంధ్ర కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన పినిపే విశ్వరూప్ వైఎస్సార్‌సీపీలో చేరడంతో పార్టీ మరింత బలోపేతమైందన్నారు. పార్లమెంటు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు, ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ మహానేత రాజశేఖరరెడ్డి తనకు రాజకీయ గురువు అని, ఆయన ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు పొందానన్నారు. 
 
 సమైక్యాంధ్రకు ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్పష్టమైన వైఖరితో పోరాటం చేస్తోందన్నారు.  పార్లమెంటు నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం పార్టీలో చేరినవారికి కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.   పి.కె.రావు, మిండగుదిటి మోహన్,   పెయ్యల చిట్టిబాబు, వాసంశెట్టి తాతాజీ,  చెల్లుబోయిన శ్రీనివాస్, జిల్లా యూత్ కమిటీ సభ్యుడు వాసురాజు, సుంకర భీమయ్య, మాజీ కౌన్సిలర్లు వాసంశెట్టి సత్య, దొమ్మేటి రాము, సంసాని నాని తదితరులు పాల్గొన్నారు.
 
 
మరిన్ని వార్తలు