వైద్య ఆరోగ్య, పోలీసు, పారిశుధ్య సిబ్బంది జీతాల వాయిదా లేదు
వారికి మార్చి నెల జీతాలు పూర్తిగా చెల్లించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశం
కరోనా కట్టడికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించిన ముఖ్యమంత్రి
సాక్షి, అమరావతి: కరోనా నివారణకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య ఆరోగ్య, పోలీసు, పారిశుధ్య సిబ్బందికి మార్చి నెల జీతాలు పూర్తిగా చెల్లించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఆదేశించారు. కరోనా కట్టడికి ఈ శాఖల సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని సీఎం పేర్కొన్నారు. అందుకే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఈ మూడు కేటగిరీల్లో సిబ్బందికి పూర్తిగా జీతాలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
వెంటనే అమలు చేయాల్సిందిగా అధికార యంత్రాంగానికి సీఎం జగన్ సూచించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు సంబంధించి జారీ చేసిన జీవోలో మార్పులు చేస్తూ వైద్య ఆరోగ్య, పోలీసు శాఖ ఉద్యోగులు, పారిశుధ్య సిబ్బందికి పూర్తి వేతనాలు చెల్లించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.