మహానేతకు వైఎస్‌ జగన్‌ ఘన నివాళి

29 May, 2019 15:05 IST|Sakshi

సాక్షి, ఇడుపులపాయ: మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులు అర్పించి ఆశీర్వాదం పొందారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ సమాధిపై పూలమాల వేసి ఆయన కొద్దిసేపు మౌనంగా ప్రార్థనలు చేశారు. జగన్‌తో పాటు ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, పలువురు పార్టీ నేతలు ఉన్నారు. అంతకు ముందు ఇడుపులపాయ చేరుకున్న జననేతకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్‌ జగన్‌ను కలుసుకునేందుకు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు కదిలారు. అంతకు ముందు జగన్‌ పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇక సాయంత్రం ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్‌లో కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరి వెళతారు.

కాగా  వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయతో వైఎస్ఆర్‌ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఇడుపులపాయ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇష్టమైన తన వ్యవసాయ భూమి ఉన్న ప్రాంతం. ఇప్పుడు ఆయన సమాధి ఉన్న నేల అది. అందుకే జగన్ ఏ కార్యక్రమం తలపెట్టినా ఇడుపులపాయ కేంద్రం అవుతోంది. అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి తండ్రి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే తొలి అడుగు వేయడం జగన్‌మోహన్‌రెడ్డికి ఆనవాయితీగా మారింది. గురువారం విజయవాడలో 'జగన్ అనే నేను' అంటూ.. ప్రమాణస్వీకారం చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్న సందర్భంగా ఆయన తండ్రి వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకుంటున్నారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
మహానేతకు నివాళులు అర్పించి వైఎస్ జగన్‌

మరిన్ని వార్తలు