కాంగ్రెస్ పార్టీ మొండిగా వ్యవహరిస్తుంది: జూపూడి

30 Aug, 2013 13:22 IST|Sakshi
కాంగ్రెస్ పార్టీ మొండిగా వ్యవహరిస్తుంది: జూపూడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన దీక్షను వెంటనే విరమించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు ఆ పార్టీ కేంద్రమండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు శుక్రవారం హైదరాబాద్లో విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. ఏదైనా పోరాడి సాధిద్దామని అన్నారు. రాష్ట ప్రజలంతా మీ వెంటే ఉన్నారని ఈ సందర్భంగా వైఎస్ జగన్కు మీడియా ద్వారా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో దయచేసి దీక్ష విరమించాలని వైఎస్ జగన్ను ఈ సందర్భంగా జూపూడి ప్రభాకర్రావు సూచించారు.



వైఎస్ జగన్ ఆదివారం చేపట్టి ఆమరణ నిరాహర దీక్ష శుక్రవారం ఆరో రోజుకు చేరుకుంది. కాగా గత అర్థరాత్రి ఆయన్ని చంచల్గూడ జైలు నుంచి భారీ బందోబస్తు నడుమ జగన్ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైఎస్ జగన్ ఆసుపత్రిలో కూడా దీక్ష విరమించలేదు. ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో దీక్ష విరమించాలని ఉస్మానియా వైద్యులు చేసిన సూచనలను వైఎస్ జగన్ తోసిపుచ్చారు. దాంతో వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జూపూడి ప్రభాకర్రావు జగన్కు పై విధంగా సూచించారు. 

మరిన్ని వార్తలు