ఆటోవాలాకు జగనన్న అండ

16 Mar, 2019 11:46 IST|Sakshi

ఏడాదికి రూ.10వేల సాయం ప్రకటించిన యువనేత

జీవితంపై భరోసా పెరిగిందంటున్న వైనం 

సాక్షి, కుప్పం : తీవ్ర సంక్షోభంలో సాగుతున్న ఆటోవాలా జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్‌ జగన్‌ ప్రకటించిన హామీలపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి ఇన్సూరెన్స్, రోడ్‌ ట్యాక్స్‌ కట్టుకోవడానికి ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏడాదికి రూ.10 వేలు చొప్పున వారి ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. రోజుకు సగటున రూ.150నుంచి రూ.200 సంపాదించుకునే ఆటో డ్రైవర్లకు పెనుభారంగా మారిన ఫిటెనెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవడం గగనంగా మారింది.

భారీగా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలతో పాటు, వాహన ఇన్సూరెన్స్‌ ప్రతి ఏటా భారమై పోయింది. చదువుకున్న యువతకు ఉపాధి లేక వేలాదిమంది నిరుద్యోగులు ఆటో తోలుకుంటూ జీవనం గడుపుతున్న వారికి వైఎస్‌ జగన్‌ హమీ భరోసా ఇస్తోంది. కాలంతో పాటు పరిగెత్తి అలసిపోతున్న జీవితాలకు జననేత జగనన్న ఇచ్చిన హామీ ఉపశమనం కలిగిస్తోందంటున్నారు.

వైఎస్‌ జగన్‌ మాటే భరోసా
ఆటో డ్రైవర్‌లకు సంవత్సరానికి పది వేల రూపాయిలు ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌ మాటే మాకు కొండంత అండ. వైఎస్‌ జగన్‌ మాటే మాకు భరోసా. పెరిగిపోతున్న చమురు ధరలు, అప్పులకు వడ్డీలు కట్టలేని ఆటోడ్రైవర్‌ల పరిస్థితిని తెలుసుకుని ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం హర్షనీయం. 
– ఎం. మహమ్మద్, రామకుప్పం 

మరిన్ని వార్తలు