అన్న వస్తున్నాడు!

13 Sep, 2018 13:18 IST|Sakshi
జిల్లాకు రానున్న ప్రజాసంకల్ప యాత్రకోసం చేపట్టబోయే ఏర్పాట్లపై జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న భూమన, చిత్రంలో పార్టీ రాష్ట్ర నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, రాజన్నదొర, ఎమ్మెల్సీ కోలగట్ల, ఇతర నేతలు పరీక్షిత్‌రాజు, బెల్లాన, చిన్నశ్రీను, పెనుమత్స, తదితరులు

విజయనగరానికి చేరువవుతున్న ‘ప్రజాసంకల్పయాత్ర’

ఈ నెల మూడోవారంలో జిల్లాకు రానున్న జగన్‌

అధినేత రాకకోసం నేతలు, కార్యకర్తల ఎదురు చూపులు

జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో పాదం కలిపేందుకు ఉత్సాహం

తొమ్మిది నియోజకవర్గాల్లో ఉరకలెత్తుతున్న ఉత్సాహం

ఏర్పాట్లలో తలమునకలైన జిల్లా నాయకులు

ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమవుతోంది. జగనన్న రాకకోసంఎదురు చూస్తున్న జిల్లా కేడర్‌లో ఉత్సాహం రెట్టింపవుతోంది.ఆయన రాకకోసం జిల్లా పార్టీ విస్తృత  ఏర్పాట్లు చేస్తోంది. బడుగువర్గాల అభ్యున్నతికోసం... నిరుపేదల సంక్షేమం కోసం...  తానుఅధికారంలోకి వస్తే ఏమేం చేయాలో తెలుసుకునేందుకు జననేతజగన్‌మోహన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర త్వరలో జిల్లాకురానుంది. జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి... తిరిగి శ్రీకాకుళంవెళ్లేంతవరకూ సంబరంగా యాత్ర సాగేలా శ్రేణులను నాయకత్వంసమాయత్తం చేస్తోంది. తొమ్మిది నియోజకవర్గాల మీదుగా యాత్రసాగించేందుకు అవసరమైన ప్రణాళికలను ఇప్పటికే పార్టీ పెద్దలురూపొందించారు.

సాక్షిప్రతినిధి విజయనగరం: ప్రజల కోసం... వారి బతుకుల్లో వెలుగులు నింపడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా.. కొనసాగించేందుకు ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరుతో పాదయాత్ర చేస్తున్న రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మరికొద్ది రోజుల్లోవిజయనగరం జిల్లాలో అడుగు పెట్టనున్నారు. ఎస్‌ కోట నియోజకవర్గం కొత్తవలస మండలం చింతలపాలెంలో ప్రవేశించి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల మీదుగా శ్రీకాకుళం జిల్లాకు వెళ్లేలా ఆ పార్టీ నేతలు రూట్‌మ్యాప్‌ తయారు చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు జిల్లాకు జననేత వస్తారా.. ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ ఆయన మార్గంలో పాదం కలపాలని జిల్లా నేతలు కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి ఆకాంక్ష తీరేరోజు ఈ నెల మూడోవారంలో రానుండటంతో ప్రతిఒక్కరిలోనూ నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది.

నవరత్నపథకాలతో చేరువ
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన వారికి చెంపపెట్టుగా శాస్త్రీయ అధ్యయనంతో రూపొందించిన నవరత్న హామీలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు ప్రకటించారు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పటికే ఆ పార్టీ నేతలు ప్రజలకు వివరించారు. రైతు భరోసా కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.లక్ష, పింఛన్ల పెంపుతో ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.24 వేల నుంచి రూ.48 వేల వరకూ, వైఎస్సార్‌ ఆసరాతో  ఒక్కొ్క్కరికీ రూ.50 వేలు, పేదలందరికీ ఇళ్లు పథకంతో ఒక్కొక్కరికీ రూ.2 లక్షల నుంచి 5లక్షల వరకూ ప్రయోజనం చేకూరనుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఏడాదికి రూ.లక్ష నుంచి రూ.1.5లక్షల వరకూ, అమ్మఒడి ద్వారా రూ.15వేలు, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకూ సాయం అందనుంది. ఒక జలయజ్ఞం, మద్యనిషేధంతో లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని లబ్ధి, సంతోషం చేకూరనుంది. ఇవన్నీ వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే చేసి చూపిస్తాననే నమ్మకాన్ని ప్రజా సంకల్పయాత్ర ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల్పిస్తున్నారు.

యాత్రకోసంభారీ ఏర్పాట్లు
జగన్‌ పాదయాత్ర అంటే ఆషామాషీ కాదు. అన్న వస్తున్నాడంటే ఆయనను చూడాలని, ఒక్కసారి కరచాలనం చేయాలని పార్టీలకు అతీతంగా ప్రజలు ఎగబడతారు. ఏ పార్టీ నేతలైనా ఆయన ప్రజా సంకల్పయాత్రను వీక్షిస్తే నిశ్ఛేష్టులై నిలబడిపోతారు. అంతలా ప్రజల ప్రేమను గెలుచుకున్నారు గనుగనే ఆయన జననేత అయ్యారు. అలాంటి నేత మన జిల్లాకు వస్తున్నారనీ... దాదాపు నెల రోజులు జిల్లాలోనే ఉంటారని తెలియగానే ఇక్కడి నేతల ఆనందాలకు అవధుల్లేకుండా పోయాయి. ప్రజా సంకల్పయాత్రను విజయవంతం చేయడం కూడా ప్రతిఒక్కరి బాధ్యతగా భావిస్తూ భారీ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనూ, నియోజకవర్గ కేంద్రాల్లోనూ పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ప్రణాళికలు రచించుకుంటున్నారు. మరో వైపు మన జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చారిత్రక ఘట్టాలను ఆవిష్కరించనుంది.  

గడచిన నాలుగున్నరేళ్ల  పాలనపై పెదవివిరుపు
నాలుగేళ్ల క్రితం జనం ఒకరిని నమ్మి... అనుభవజ్ఞుడని, హామీలు నెరవేరుస్తాడని ఓట్లు వేశారు. రుణమాఫీ అంటూ, ఇంటింటికీ ఉద్యోగం అంటూ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన ఆ పెద్దమనిషి ప్రజా సమస్యలను పట్టించుకోవడమే మానేశారు. ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతుంటే. అమాయకులు, సామాన్యులు అడుగడుగునా అన్యాయానికి గురవుతుంటే వారి కష్టాలను, కన్నీళ్లను చూసి చలించిపోయిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ, ప్రజల గుండెల్లో ధైర్యాన్ని నింపుతూ ప్రజా సంకల్పయాత్ర సాగిస్తున్నారు. ఇప్పటికే 10 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని 11వ జిల్లాగా విశాఖపట్నంలో అలుపెరుగని బాటసారిగా ముం దుకు సాగుతున్నారు. 12వ జిల్లాగా మన జిల్లాలో అతి త్వరలో అడుగు పెట్టబోతున్నారు.

మరిన్ని వార్తలు