అన్న వస్తున్నాడు

11 Nov, 2018 07:28 IST|Sakshi

ఉదయించే సూర్యుడిలా... మరింత శక్తివంతంగా...

రేపటినుంచే జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పునఃప్రారంభం

గత నెల 25న జననేతపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం

గాయపడిన జగన్‌ చికిత్స కోసం పాదయాత్రకు విరామం

గాయాల నుంచి కోలుకుని తిరిగి జనంవద్దకు పయనం

మూడంచెల భద్రత ఏర్పాటు చేసిన పోలీస్‌ శాఖ

అన్న వస్తున్నాడు... అవును జగనన్న వచ్చేస్తున్నాడు. కుట్రలను ఛేదించుకుని... మృత్యువుని జయించి... సంకల్పాన్ని చేరుకునేందుకు... జనం మధ్యకు దూసుకు వస్తున్నాడు. ప్రజాసంక్షేమమే తన లక్ష్యంగా... జనహితమే తన అభిమతంగా... ప్రజారంజక పాలనకోసం పరితపించే నాయకునిలా... జనం కష్టాలను దగ్గరగా చూడాలని...వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న బాటసారి వస్తున్నాడు. ప్రస్తుత పాలనలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకునేందుకు... బడుగుల కష్టాలు వినేందుకు... వారి కన్నీళ్లు తుడిచేందుకు... రాజన్నబిడ్డగా మనముందుకొస్తున్నాడు.

సాక్షిప్రతినిధి విజయనగరం: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర సోమవారం నుంచి జిల్లాలో పునఃప్రారంభం కానుం ది. ప్రజాక్షేత్రంలోనే ప్రతినిత్యం ఉంటూ, జనం కష్టాలు తెలుసుకునేందుకు ఆయన గత ఏడాదిగా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా ఓర్వలేని కొందరి కుట్రల ఫలితంగా విశాఖ ఎయిర్‌పోర్టులో గత నెల 25న తనపై జరిగిన హత్యాయత్నంలో తీవ్రంగా గాయపడిన జననేత ఇప్పుడిప్పుడే కోలుకుని జిల్లాలోని సాలూరు నియోజకవర్గం, మక్కువ ప్రాంతంలో పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. జగనన్నకు స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తుండగా, మృత్యుంజయుని పలకరించేందుకు జిల్లా ప్రజానీకం సిద్ధమవుతోంది. మరోవైపు ప్రతిపక్ష నేతకు ఎలాంటి హాని జరగకుండా కాపాడుకోవడానికి మూడంచెల భద్రతను జిల్లా పోలీస్‌ యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది.

రేపటి నుంచి పల్లెల్లో మళ్లీ సందడి
రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 12వ తేదీనుంచి ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం శనివారం తెలిపారు. విశాఖ విమానాశ్రయంలో గత నెల 25వ తేదీన జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో వైద్యులు ఆయనకు చికిత్స జరిపి విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన విషయం విదితమే. గాయం నుంచి కోలుకున్న ఆయన ముందుగా ప్రకటించిన విధంగా ఇచ్చాపురం వరకు తన పాదయాత్రను కొనసాగించాల్సి ఉన్నందున సోమవారం నుంచి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ నుంచి పాదయాత్ర పునః ప్రారంభిస్తున్నట్లు తలశిల వెల్లడించారు. 

మూడంచెల భద్రత: జననేత చేపడుతున్న ప్రజాసంకల్పయాత్రకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జి.పాలరాజు తెలి పారు. సాక్షిప్రతినిధితో శనివారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో జిల్లాలో ఆయనకు మూ డంచెల భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జగన్‌కు ప్రభుత్వం కేటాయించిన గన్‌మన్లు మొదటి వలయంగా, జగన్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది రెండవ వలయంగా, పోలీస్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో రోప్‌ పార్టీ మూడవ వలయంగా జగన్‌కు భద్రత కల్పిస్తారని ఎస్పీ వివరించారు. ఎవరు జగన్‌ను కలవాలన్నా ఈ మూడు వలయాలను దాటి రావాల్సి ఉం టుందన్నారు. వలయం లోపల ఉండే సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తున్నామని, అలాగే వలయంలోకి వచ్చే వారు కూడా గుర్తింపు కలిగిన వ్యక్తులు లేదా గుర్తింపు కార్డు కలిగిన వారైతేనే అనుమతిస్తామని చెప్పారు. 

అడ్వాన్స్డ్‌ లైజనింగ్‌ టీమ్‌ పాదయాత్ర మార్గంలో ముందు వెళుతూ జగన్‌ను కలవాలనుకుంటున్నవారిని తనిఖీచేసి, వారి వివరాలు తెలుసుకుంటుందని, అనుమానం వస్తే వెంటనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ఇకపై ఏజెన్సీ ప్రాంతంలో పాదయాత్ర సాగనున్నందున ప్రత్యేక బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తాయని, మఫ్టీలో కూడా పోలీసు సిబ్బంది జగన్‌ పాదయాత్రలో భద్రత కో సం ఉంటారని చెప్పారు. ప్రతిపక్ష నేత పాదయాత్రకు ఎలాంటి విఘాతం కలుగకుండా, ఆయనను కలవాలనుకునే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పోలీస్‌ విధులు ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు