గ్రామాల రూపు రేఖలు మార్చబోతున్నాం: సీఎం వైఎస్‌ జగన్‌

19 May, 2020 16:18 IST|Sakshi

సాక్షి, అమరావతి: చరిత్రలో ఎప్పుడూ లేనంతగా గ్రామాలపై శ్రద్ధ పెట్టామని, రాబోయే రోజుల్లో గ్రామాల రూపురేఖలు మొత్తం మార్చబోతున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున సీఎం‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పేదలందరికీ జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. అర్హులైన 27 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. అందులో భాగంగా భూసేకరణకు సంబంధించిన పనులను మే 31లోగా సిద‍్ధం చేయడంతోపాటు అన్ని పనులను పూర్తి చేయాలి. ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు. అర్హత  ఉండి ఇంటి స్థలం ఇవ్వలేదనే మాట రాకూడదని' వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

మే 21వరకు దరఖాస్తులకు అవకాశం
ఇంటి పట్టాలకు సంబంధించి ఎవరైనా ఇంకా మిగిలి ఉంటే వారి కోసం మే 21వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించాం. మే 30 కల్లా వీటికి సంబంధించిన వెరిఫికేషన్‌ పూర్తి కావాలి. ఇళ్ల పట్టాలకు సంబంధించి తుది జాబితా జూన్‌ 7న ప్రకటించాలి. ఇప్పటికే ఇళ్ల పట్టాల కోసం రూ.4,436.47 కోట్లు విడుదల చేశాం. జిల్లా ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లను నియమించాం. ఒక జేసీ రైతు భరోసా, రెవిన్యూ.. రెండో జేసీ గ్రామ, వార్డు సచివాలయాలు, అభివృద్ధి కార్యక్రమాలు.. మూడో జేసీ ఆసరా, వెల్ఫేర్‌ కార్యక్రమాలు పనులను అప్పగించాం. గతంలో ప్రభుత్వ కార్యక్రమాలపై ఎప్పూడూ పెట్టనంత దృష్టి పెట్టాం. గ్రామాల రూపు రేఖలు మార్చబోతున్నాం. గ్రామాలలో ఏర్పాటుచేసే విలేజ్ క్లినిక్స్‌లో 24 గంటలూ ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారు. చదవండి: కలెక్టర్లు, ఎస్పీలే నా బలం: సీఎం జగన్‌

మద్యం వినియోగాన్ని బాగా తగ్గించే కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే లిక్కర్ రేట్లు పెంచాం. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించాం. బెల్టుషాపులు తొలగించాం. పర్మిట్ రూంలను ఎత్తివేశాం. జేసీల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేస్తాం. పార్టీలకతీతంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలి. ఉపాధి హామీకి కేంద్రం అదనంగా రూ.40వేల కోట్లు కేటాయించింది. చాలామంది కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చారు. వలస కూలీలందరికీ  జాబ్ కార్డులు ఇవ్వాలి. వారందరికీ తప్పనిసరిగా పనులు కల్పించాలని' కలెక్టర్‌లను వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

ఇసుక, మద్యం అక్రమాలకు చెక్‌
మద్యం అక్రమాలకు చెక్‌ పెట్టడానికి యువ ఐపీఎస్‌ అధికారులను పెట్టాం. తొలిసారి ఈ బాధ్యతలను పోలీస్‌ విభాగానికి అప్పగించాం. ఇసుక, మద్యం అక్రమ రవాణాలను అడ్డుకోవడానికి మనం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. దీనికి సంబంధించి ప్రత్యేక జేసీని పెట్టాం. వర్షాకాలం వచ్చేలోగా కావాల్సిన ఇసుకను అందుబాటులో ఉంచాలి. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకొని ఇసుక నిల్వలు పెంచేలా చూడాలని సూచించారు. 

తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి
తాగునీరు దొరకలేదనే మాట ఎక్కడా రాకూడదు. చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో పశువులకు తాగునీరు అందిస్తున్నాం. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి కొరతను తీర్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. ఈ పనులన్నింటినీ కూడా కలెక్టర్లు పర్యవేక్షించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. చదవండి: 'ఢిల్లీలో చక్రాలు, బొంగరాలు తిప్పిన రోజులెక్కడ' 

మరిన్ని వార్తలు