సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 5వేల హెల్త్ సబ్ సెంటర్లకు జనవరిలో పనులు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి మూడు లేదా నాలుగో వారంలో ఈ పనులకు శంకుస్థాపన చేయనుంది. శుక్రవారం ఆస్పత్రుల్లో ‘నాడు-నేడు’పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎం వైఎస్ జగన్కు అందజేశారు. సబ్ సెంటర్లు, ఆస్పత్రులు, మెడికల్ కాలేజీలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్తగా నిర్మించదలచిన కిడ్నీ, క్యాన్సర్ ఆస్పత్రులకు నిధుల సమీకరణ, ఖర్చుపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో చర్చించారు. నాడు-నేడు కోసం డిసెంబర్, జనవరి, మార్చిలలో మూడు విడతల్లో టెండర్లు నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆరోగ్య లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ఎవరైనా లబ్ధిదారులు మిగిలిపోతే.. వారు ఎవరిని సంప్రదించాలి.. ఎవరికి దరఖాస్తు చేయాలన్న అంశాలను కూడా పొందుపరచాలని తెలిపారు. ఏప్రిల్ నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం రోగులకు మందులు అందించాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో నాడు-నేడు కింద చేపట్టే కార్యక్రమాలు నాణ్యతతో ఉండాలని దిశా నిర్దేశం చేశారు. తీవ్ర వ్యాధులతో బాధ పడుతున్నవారికి.. ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే పద్ధతి సులభతరంగా ఉండాలని సూచించారు. ఏఎన్ఎం సహాయంతో స్లాట్ బుక్ చేయించి.. వెంటనే పరీక్షలు, సర్టిఫికెట్ జారీ చేసేలా చూడలన్నారు. రోగుల కోసం అవసరమైదే ప్రత్యేక వాహన సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పారు.
నవంబర్ 1 నుంచి హైదరాబాద్లోని 72, బెంగళూరులోని 35, చెన్నైలోని 23 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. డిసెంబర్ 2 నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్స చేయించుకున్నవారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు చెప్పారు. డిసెంబర్ 15 నుంచి ఆస్పత్రుల్లో 510 రకాల మందులను అందుబాటులో ఉంచామని వివరించారు.
వృద్ధులకు స్క్రీనింగ్ ప్రారంభించాలి : సీఎం జగన్
‘సదరం క్యాంపుల్లో రద్దీని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. గతంలో వారానికి కేవలం 2715 స్లాట్లు ఉండగా ప్రస్తుతం 8680 స్లాట్లను అందుబాటులోకి తెచ్చాం. బుక్ చేసుకున్న వారం రోజులకే స్లాట్ దొరికే పరిస్థితి ఇప్పుడు ఉంది. కంటి వెలుగు కింద 64,52,785 మంది పిల్లలకు పరీక్షలు నిర్వహించగా.. వారిలో 4,33,600 మందికి సమస్యలు ఉన్నట్టుగా గుర్తించాం. ఇప్పటివరకూ 3,59,396 మందికి రెండోదశ స్క్రీనింగ్ పూర్తయింది. 1,86,100 మంది వైద్యం చేయించుకోవాల్సి ఉంది. 1,36,313 మందికి కంటి అద్దాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకన్నాం. 41,592 మందికి 5శాతం పైన సైట్ఉన్నట్టు నిర్ధారణ అయింది.. వీరికి మళ్లీ స్క్రీనింగ్ చేయాల్సి ఉంది. కనీసం 2–3వేలమంది శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించాం’ అని అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు. తర్వాత సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇదే తరహాలో వృద్ధులకు స్క్రీనింగ్ ప్రారంభించాలని ఆదేశించారు.
పశ్చిమ గోదావరిలో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు
జనవరి 3న పశ్చిమ గోదావరి జిల్లాలో 2వేల రోగాలకు ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. మిగిలిన 12 జిల్లాల్లో కూడా 1200 రోగాలకు ఆరోగ్యశ్రీ సేవలు అందించనున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
జనవరి 1 నుంచి అమలు చేయనున్న కార్యక్రమాలు