పులివెందుల అభివృద్ధిపై సీఎం జగన్‌ సమీక్ష

13 Feb, 2020 14:42 IST|Sakshi

సాక్షి, తాడేపలి​ : వైఎస్సార్‌ జిల్లా పులివెందుల ప్రాంత అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాఖల వారీగా చేపడుతున్న పనులను సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, ఇరిగేషన్‌ పనులపై సమీక్ష చేపట్టారు.

పులివెందులు మెడికల్‌ కాలేజ్‌ పనులపై సీఎం వైఎస్‌ జగన్‌ రివ్యూ చేపట్టగా.. పనులకు సన్నద్ధవవుతున్నామని అధికారులు ఆయనకు తెలిపారు. అలాగే క్యాన్సర్‌ ఆస్పత్రి, ఇటీవల చేసిన శంకుస్థాపనలకు సంబంధించిన పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. పనుల ప్రగతి, నిధుల ఖర్చులతో పాటు ఇతరత్రా అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. గ్రామాలవారీగా గోదాములు, మండలాల వారీగా కోల్డ్‌స్టోరేజీలు, పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లపై మ్యాపింగ్‌ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లన్నీ ఒకే తరహా నమునాలో ఉండాలన్నారు. 


ఈసారి వదరనీరు వచ్చినప్పుడు గండికోట, చిత్రావతి రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి ముందుగానే అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.  ముద్దనూరు నుంచి కొడికొండ చెక్‌పోస్టు వరకు రోడ్డు విస్తరణ పనులపై దృష్టి సారించాలని.. వీలైనంత త్వరగా పనులను చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.

ఈ సమీక్ష సందర్భంగా ఖర్జూర పెంపకంపై కొందరు రైతులు ఆసక్తి చూపుతున్నారని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఖర్జూర సాగుకు వాతావరణం, ఖర్చులు ఇతరత్రా అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. ఖర్జూర పెంపకానికి సంబంధించి అధ్యయనం చేయించాలని ఆదేశించారు. చిరుధాన్యాలను బాగా ప్రమోట్‌ చేయాలన్నారు. ఏపీ కార్ల్‌లో ఉన్న మౌలిక వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. అలాగే వెటర్నరీ, హార్టికల్చర్‌ రంగాల్లో గొప్ప సంస్థ ఏర్పాటుకు తగిన ఆలోచన చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఒక వారం రోజుల్లో దీనిపై ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. పులివెందులలో ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన బోధన అందించే ఒక స్కూల్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. టౌన్‌ హాల్‌ నిర్మాణంపై కూడా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

మరిన్ని వార్తలు