పేదలకు ఇళ్లు కూడా కట్టించి ఇస్తాం : సీఎం జగన్‌

31 Dec, 2019 15:18 IST|Sakshi

సాక్షి, అమరావతి : పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా.. ఇళ్లు కూడా కట్టించి ఇస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ సచివాలయంలో స్పందన కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్సలో సీఎం వైఎస్‌ జగన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులతో చర్చించారు. ‘పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమం నాకు మాత్రమే కాదు కలెక్టర్లందరికీ నచ్చిన కార్యక్రమం. ఇప్పటివరకూ 22,76,420 మంది లబ్ధిదారులను గుర్తించాం. ఇంకా 15 వేల ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకోసం కలెక్టర్లు మరింత ఉధృతంగా పనిచేయాల్సి ఉంటుంది. ఉన్న రెండు నెలల సమయంలోనే మొత్తం భూముల గుర్తింపు, సేకరణ పూర్తి కావాలి. 

ప్రతి జిల్లాలో కనీసం రెండు నుంచి మూడు సార్లు ఉన్నతాధికారులు పర్యటించాలి. జిల్లా అధికారులతో చర్చించి.. ఇళ్లపట్టాలు ఇవ్వడంలో ఉన్న సమస్యలను తీర్చడానికి ప్రయత్నించాలి. నిద్రలేచిన దగ్గర నుంచి ఇళ్లపట్టాల అంశంపైనే ఆలోచన చేయాలి. దేవాలయాలు, ఇతర ప్రార్థన స్థలాలు, విద్య, ఆరోగ్య సంస్థలకు సంబంధించిన స్థలాలు కాకుండా ఇతర భూములను ఇళ్ల పట్టాలకు సంబంధించి పరిశీలన చేయాలి. ఇది చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా కట్టించి ఇస్తాం’ అని సీఎం వైఎస్‌ చెప్పారు.ఈ సందర్భంగా.. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జబితా ప్రదర్శించామని అదికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు తెలిపారు. 

మహిళా పోలీస్‌ స్టేషన్‌ల బలోపేతం : సీఎం జగన్‌
అలాగే  ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన ‘దిశ’ చట్టం అమలుపై సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ‘ప్రతి జిల్లాలో మహిళా పోలీస్‌ స్టేషన్‌ను బలోపేతం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఎక్కడుంది అన్న దానిపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. అందులో సిబ్బందిని బలోపేతం చేయాలని సూచించారు. దిశ చట్టాన్ని అమలు చేయడంలో కలెక్టర్లు, ఎస్పీలు దృష్టిపెట్టాలి. చిన్నారులపై లైంగిక వేధింపులకు గురిచేయడం లాంటి ఘటనలను తీవ్రంగా పరిగణించాలి. ఉమ్మడి జాబితాలోని అంశం కాబట్టి ప్రభుత్వం చేసిన చట్టాన్ని రాష్ట్రపతి సంతకం కోసం పంపాం. ఈలోగా మనం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీలు ఓనర్‌షిప్‌ తీసుకుంటే.. మహిళలు, చిన్నారులపై దారుణాలు ఆగుతాయి. ఇందుకోసం అంకితభావంతో పనిచేయాలి. 

ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు ఎస్సైలు, అదనపు ఎస్సైలను పెడుతున్నాం. బోధనాసుపత్రిలో ఉన్న ఒన్‌ స్టాప్‌ సెంటర్‌లో ప్రత్యేక ఏర్పాటు చేయాలి. దీనికి పబ్లిసిటీ ఇవ్వాలి. అందులో కూడా ఒక ఎస్సైని ఉంచుతున్నాం. పోలీసులు, మహిళా సంక్షేమ అధికారులు కలిసి పనిచేయాలి. దిశ చట్టం అమలు కోసం ఒక ఐపీఎస్‌ అధికారిని ప్రత్యేకంగా పెడుతున్నాం. అలాగే మహిళా సంక్షేమ శాఖ నుంచి ఐఏఎస్‌ అధికారి ఉంటారు. అలాగే జిల్లాకు ఒక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను కూడా ఉంచుతాం. అలాగే ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ల సామర్థ్యాన్నిపెంచుతున్నాం. విశాఖ, తిరుపతిలో కొత్త ల్యాబ్‌లను నిర్మిస్తున్నాం. అలాగే ప్రత్యేక కోర్టుల కోసం ఒక్కో కోర్టుకు రూ. 2 కోట్లు చొప్పున.. రూ. 26 కోట్లు ఇస్తున్నాం. డబ్బును డిపాజిట్‌ కూడా చేస్తున్నాం. వీటన్నింటిపైనా కూడా ప్రచారం చేయాలి. తప్పులు చేసిన వారిని వెంటనే చట్టం ముందు నిలబెట్టి బాధితులకు న్యాయం కలిగిస్తున్నామన్న విశ్వాసం ప్రజలకు కల్పించాలి. దిశ కాల్‌ సెంటర్‌, యాప్‌ కూడా ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా నెల రోజుల్లోనే సిద్దం చేయాలి’ అని అన్నారు. ఈ సందర్భంగా దిశ చట్టం అమలుకు తీసుకుంటున్న చర్యలను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కలెక్టర్లు, ఎస్పీలకు వివరించారు. 

జనవరి 20 నుంచి అన్ని జిల్లాలో ఇసుక డోర్‌డెలవరీ..
ఇసుక డోర్‌డెలవరీపై సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ‘కొంతమంది రవాణాదారులు ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు సమచారం ఉంది. ఈ ఇబ్బంది వినియోగదారుడికి లేకుండా చూడాలి. మధ్యవర్తుల ప్రమేయం ఉండకూడదు. బుక్‌ చేసుకున్న వెంటనే ఇసుక ఇంటికి వచ్చేలా ఏర్పాటు చేయాలి. హైదరాబాద్‌లో మెట్రో వాటర్‌ సప్లై రీతిలో ఇసుక సరఫరా జరగాలి. కృష్ణా జిల్లాలో 2వ తేదీన పైలట్‌ ప్రాజక్టు కింద దీనిని చేపడుతున్నాం. జనవరి 10న విశాఖ, పశ్చిమ గోదావరి, వైఎస్సార్‌ కడప జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా మొదలుపెడతాం. జనవరి 20 నాటికి అన్ని జిల్లాల్లో ఇసుక డోర్‌ డెలివరీ ద్వారా అందిస్తాం. 

ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణాల నిరోధానికి జనవరి 20 నాటికి 389 చెక్‌పోస్టుల్లో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఉంటాయి. జూన్‌ 1 నుంచి ఇప్పటివరకూ అక్రమంగా తరలిస్తున్న 50,348 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నాం. 4644 వాహనాలు సీజ్‌ చేశాం. డిసెంబర్‌లో 2159 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకుని, 355 వాహనాలను అధికారులు సీజ్‌ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 2976 కేసులు నమోదు అయ్యాయి. ప్రతి నెలా 15 లక్షల టన్నుల చొప్పున ఫిబ్రవరి నుంచి 4 నెలల పాటు ఇసుకను రిజర్వ్‌ చేయాలి. జూన్‌లో వర్షాలు మొదలయ్యే నాటికి 60 లక్షల టన్నులు స్టాక్‌ చేయాలి. గత ప్రభుత్వం ఇది చేసి ఉంటే.. ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. స్టాక్‌ పెడుతున్నామా లేదా అన్నదానిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు