ఆ పథకం చరిత్రలో నిలిచిపోవాలి: సీఎం జగన్‌

1 Oct, 2019 16:50 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

ఉగాది నాటికి ఇళ్ళ పట్టాలు

గ్రామ సచివాలయ ఖాళీ భర్తీ చేయాలి

ప్రతి ఆడబిడ్డ డిగ్రీ  వరకు చదవాలి

‘స్పందన’పై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: సొంతంగా ఆటోలు, కార్లు నడుపుకుంటున్న వారికి వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం ద్వారా రూ.10వేలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. అక్టోబరు 4న ఏలూరులో ఆటో డ్రైవర్లకు నగదును పంపిణీ చేయడం ద్వారా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు. అదే రోజున మంత్రులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల్లో ఈ పథకం మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంపై సమీక్షలో భాగంగా మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ డబ్బు అంతా అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాల్లో ఉండేలా చూడాలని ఆదేశించారు. వాహన మిత్రకు ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్లు 1,75,309 కాగా..  ఇప్పటికే 1,64,295 వినతులను మంజూరు చేసినట్లు ప్రభుత్వం తేల్చింది. కాగా సమీక్షలో భాగంగా కలెక్టర్లకు, అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.

గ్రామ సచివాలయాలపై సమీక్ష.. 
గ్రామ వాలంటీర్లుగా ఉన్నవారు గ్రామ సచివాలయ ఉద్యోగాలకు రాసి, ఎంపికై ఉండొచ్చు. ఖాళీ అయిన చోట్ల వారిని భర్తీ చేయాలి. అవసరమైన చోట అర్హతలను తగ్గించే అవకాశాలను పరిశీలించాలి. ఇంటర్మీడియట్‌ను అర్హతగా పరిగణిస్తే ఇక్కడ భర్తీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అక్టోబరు 15 నుంచి మొత్తం వాలంటీర్ల నియామకం జరగాలి. ఖాళీ అన్న మాట నాకు వినిపించకూడదు. వాలంటీర్‌ పోస్టు ఖాళీగా ఉంటే.. ప్రయోజనాలు నెరవేరవు. చివరి స్థాయిలో అనుసంధానం నిలిచిపోతుంది. క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించి వాలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేయాలి. 

కంటివెలుగుపై సమీక్ష
కంటివెలుగు కింద ప్రభుత్వ స్కూళ్లే కాదు, ప్రైవేటు స్కూళ్లలో చదువుకున్న విద్యార్థులు కూడా కవర్‌కావాలి. డేటాను కూడా సిద్ధంచేయాలి. కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించడానికి 42,360 ఆశా వర్కర్లు, 62,500 మంది టీచర్లు, 14వేల మంది ఏఎన్‌ఎంలు, 14వేలమంది పబ్లిక్‌ హెల్త్‌ స్టాఫ్‌ శిక్షణ పొందుతున్నారు. స్కూలు వారీగా సూక్ష్మస్థాయి ప్రణాళిక తయారు చేస్తున్నాం. అక్టోబరు 10 నుంచి 16 వరకు అన్ని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధులకు స్క్రీనింగ్‌ వారికి చికిత్స అందించే కార్యక్రమం నవంబరు 1 నుంచి డిసెంబరు 31వరకూ అమలు. 

మహిళ్లలో పౌష్టికాహారలోపం, రక్తహీనతపై దృష్టి
గ్రామ వాలంటీర్ల ద్వారా వీరిని పరీక్షించే కార్యక్రమాన్ని చేపట్టాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో స్క్రీనింగ్‌ చేయమని చెప్పాం. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తికావాలి. ఈ సమస్యకు కచ్చితంగా పరిష్కారం చూపాలి. పిల్లల్లో పౌష్టికాహారం కోసం గతంలో ఇచ్చే రూ.8లను రూ.18ల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే తల్లులకూ మంచి ఆహారం అందించడానికి ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గర్భంతో ఉన్న మహిళలను, పిల్లల తల్లులను మనం బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వీరికి రోజుకు రూ.50లు ఖర్చుచేసి మంచి ఆహారం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామ వాలంటీర్ల భాగస్వామ్యం తీసుకోండి. తమకు కేటాయించిన కుటుంబాల్లోని ప్రతి చిన్నపిల్లల కుటుంబానికి, గర్భంతో ఉన్న మహిళలకు, చిన్నపిల్లలకు ఈ కార్యక్రమం గురించి చెప్పాల్సి ఉంది. అంగన్‌ వాడీ కేంద్రాల్లో వీరి వివరాలను పొందుపరచాలి. ప్రతి ఆడపిల్ల డిగ్రీ  వరకు చదవాలి. 21 ఏళ్లు నిండిన తరువాతనే ఆడపిల్ల పెళ్లిచేసుకోవాలన్న ప్రచారం బాగా వెళ్లాలి.

సీనియర్‌ సిటిజన్స్‌ కౌన్సిల్‌.. 
రాష్ట్రస్థాయి సీనియర్‌ సిటిజన్స్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి. కనీసం నలుగురు సీనియర్‌ సిటిజన్స్‌ ఈ కౌన్సిల్‌లో ఉంటారు. కనీసం నెలకోసారి మాతో వీరు సమావేశం అవుతారు. అదే రీతిలో జిల్లాల స్థాయిలో కూడా ఈ కౌన్సిల్స్‌ ఏర్పాటవుతాయి. ప్రతి ఒక్కరు కూడా సీనియర్‌ సిటిజన్స్‌ అవుతారు. మనం వాళ్లని సరిగ్గా చూసుకోకపోతే.. రేపు మనల్ని చూసుకునేవాళ్లు ఉండరు. సీనియర్‌ సిటిజన్స్‌ను సరిగ్గా చూసుకునే కార్యక్రమాలు చేయాలి. వారికి చేయాల్సినదంతా చేయాలి.

ఉగాది నాటికి ఇళ్ళపట్టాలు..
ఇప్పటివరకూ 17,34,817 మంది లబ్దిదారుల గుర్తిచాం. మిగిలిన దరఖాస్తుల పరిశీలన కూడా త్వరలోనే  అధికారులు పూర్తిచేస్తామన్నారు.  గ్రామాల వారీగా జాబితాను తయారు చేయాలి. ఈ జాబితాను గ్రామ సచివాలయాల బోర్డుల్లో ఉంచాలి. పట్టా ఇవ్వడమే కాదు, ఆ భూమి ఎక్కడుందో లబ్ధిదారునికి చూపించాలి. దేశంలో ఎప్పుడూ, ఎక్కడా కూడా ఈ స్థాయిలో ఇళ్లపట్టాలను పంపిణీ చేయలేదు. ఈ కార్యక్రమాన్ని చరిత్ర గుర్తుంచుకుంటుంది. ఇంట్లో మహిళ పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలి:

రైతు భరోసా..
అక్టోబరు 5న గ్రామ సచివాలయాల్లో లబ్దిదారుల జాబితా ఉంచేందుకు ప్రయత్నించాలి. అక్టోబరు 8న తుది జాబితాను వ్యవసాయశాఖకు పంపాలి. కౌలు రైతులకు సాగు హక్కు పత్రంపై రైతుల్లో అవగాహన పెంచాలి.  రైతుల్లో చైతన్యం నింపాల్సిన అవసరం ఉంది. (చదవండి: గత ప్రభుత్వానికీ, ఇప్పటి ప్రభుత్వానికి తేడా కనిపించాలి)

మరిన్ని వార్తలు