పోలవరంపై తీవ్ర గందరగోళం

17 Mar, 2017 02:17 IST|Sakshi
పోలవరంపై తీవ్ర గందరగోళం

ప్రతిపక్షనేత మాట్లాడుతుండగా రెండు సార్లు మైక్‌ కట్‌
స్పీకర్‌ తీరుపై విపక్ష సభ్యుల తీవ్ర నిరసన
పోలవరం చట్టపరంగా మనకు దక్కిన హక్కు: జగన్‌
ఇవాళే ఏదో సాధించినట్లుగా గొప్పలు చెప్పడమేమిటి?


సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై గురువారం అసెంబ్లీలో తీవ్ర గందర గోళం జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు, నినాదాలు, నిరసనల మధ్య సభ వాయిదా పడింది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి మైక్‌ ఇచ్చినట్టే ఇచ్చి కట్‌ చేస్తున్న తీరును నిరసిస్తూ విపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం ఎదుట నిరసన తెలిపారు. తమకు న్యాయం కావాలని, ప్రతిపక్ష నాయకునికి మాట్లాడే అవకాశమివ్వాలని నినదించారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ కోడెల ప్రశ్నోత్తరాలను చేపడుతూ తొలి ప్రశ్న పోలవరం ప్రాజెక్టుపై జవాబు చెప్పాల్సిందిగా మంత్రి దేవినేనిని ఆదేశించారు.

2014 ఏప్రిల్‌ 1 నాటికి పోల వరం ప్రాజెక్టు మిగులు వ్యయాన్ని కేంద్రమే నూటికి నూరు శాతం భరిస్తుందని, నాబార్డ్‌ నిధులతో ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. పోలవరంపై  రూ.8,898.39 కోట్లు ఖర్చు చేశామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన 2014 నుంచి 2017 జనవరి నాటికి రూ.3,349.70 కోట్లు వ్యయం చేశామన్నారు.  2018 నాటికి గ్రావిటీతో నీటిని సరఫరా చేస్తామని, 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాల్వ శ్రీనివాసులు, రామా నాయుడు, బీజేపీ సభ్యు డు ఆకుల సత్యనారాయణ మాట్లాడారు. ఈ దశలో మాట్లాడేందుకు అనుమతినివ్వాలని   వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు.

అది రాష్ట్ర దౌర్భాగ్యం
ఆ తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ తాను సబ్జెక్ట్‌కే పరిమితమై మాట్లాడతానని, వీళ్లకు సమాధానమిస్తూ పోతే సబ్జెక్టు పక్కదారి పడుతుందంటూ... మనిషన్న తర్వాత నీతి నిజాయితీ, పరిపూర్ణ విశ్వాసం, చిత్తశుద్ధి ఉండాలన్నారు. ఇట్లాంటి వ్యక్తి (దేవినేనిని ఉద్దేశించి) మంత్రిగా ఉండడమే రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. తన ప్రసంగాన్ని మొదలు పెట్టబోతుండగానే స్పీకర్‌– కంక్లూడ్‌(ముగించండి)– అన్నారు. దీనికి వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మొదలు పెట్టీ పెట్టగానే కంక్లూడ్, కంక్లూడ్‌ అంటారు. వాళ్లకు (అధికార పక్షం) అంత సమయమిచ్చి మమ్మల్ని ముగించమంటా రేమిటీ? ఆ మంత్రి ఏకంగా అరగంట మాట్లా డారు, మా వాదన చెప్పుకోనివ్వరా? అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ తర్వాత జగన్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ టీడీపీ అధికారం లోకి రాకముందు ఈ ప్రాజెక్టుపై రూ.5,558 కోట్లు ఖర్చు పెడితే ఈ మూడేళ్లలో వీళ్లు 3 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి అదేదో గొప్పగా చెబుతున్నారన్నారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం కుడికాలువ పూర్తి కావడం వల్లే.. వీళ్లు గొప్పగా చెప్పుకుంటున్న గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం సాధ్యమైందన్నారు. మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో చేసిన తీర్మానం ప్రతిలోని అంశాలను వైఎస్‌ జగన్‌ చదివి వినిపించారు. ఈ ప్రాజెక్టు కోసం మొదట్లో ఖరారు చేసిన రూ.16 వేల కోట్లలోని ఇరిగేషన్‌ కాంపొనెంట్‌నే కేంద్రం భరాయిస్తుం దని, అందులో ఇప్పటికే వ్యయం చేసిన రూ. 5,558 కోట్లను, పవర్, డ్రింకింగ్‌ వాటర్‌ కాంపొనెంట్‌ల వాటా రూ.2,800 కోట్లను కేంద్రం ఇవ్వబోదన్నారు. ఇక మిగిలేది కేవలం రూ.7,500 కోట్లేనని చెబుతుండగా స్పీకర్‌ మైక్‌ కట్‌ చేసి చోడవరం ఎమ్మెల్యే రాజుకు ఇచ్చారు. స్పీకర్‌ తీరును నిరసిస్తూ వైఎస్సార్‌ సీపీ సభ్యులు సభ మధ్యలోకి వెళ్లి మాకు న్యాయం కావాలంటూ, విపక్ష నాయకునికి మైక్‌ ఇవ్వాలంటూ నినదించారు. ఈ గొడవ మధ్యలోనే దేవినేని మాట్లాడారు. ప్రాజెక్టును రూ. 16 వేల కోట్లకే పరిమితం చేయలేదన్నారు. ఈ సమయంలో విపక్ష సభ్యులు బిగ్గరగా నినాదాలు చేయడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు.  

పోలవరం చట్టపరంగా దక్కిన హక్కు
రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిం చిందని, అది ఆంధ్రుల హక్కని వైఎస్‌ జగన్‌  స్పష్టం చేశారు. ‘‘ఇప్పుడే ఏదో ఇష్యూ జరిగినట్టుగా, ఇంతవరకు పోలవరం ఇష్యూనే కాదన్నట్టుగా, ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా కేంద్రం ఆమోదం తెలిపినట్టుగా మంత్రి గొప్పగా చెబుతున్నారు. కానీ, పార్లమెంటు ఆమోదించిన రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని 91వ సెక్షన్‌ ప్రకారం కేంద్రం రాష్ట్రాన్ని విడగొట్టే సమ యంలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. సెక్షన్‌ 90లోని సబ్‌సెక్షన్‌ కోడ్‌ కింద కేంద్రమే ఈ ప్రాజెక్టును ఎగ్జిక్యూట్‌ చేస్తుందనీ ఉంది. పునర్‌వ్యవస్థీకరణ చట్ట ప్రకారం అది మనకు రావాల్సిన హక్కు. జాతీయ ప్రాజె క్టుగా ప్రకటించిన తర్వాత మిగతావి లాంఛనమే. కచ్చితంగా చేయాల్సిన కనీస ధర్మం కేంద్రానిది. అదేకాకుండా.. మండలాల విలీనం అంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారు.

రాష్ట్రాన్ని విడగొ ట్టిన తర్వాత 2014 మార్చి 2న జరిగిన కేంద్ర కేబినెట్‌ మీటింగ్‌లో 3 తీర్మానాలు చేసి రాష్ట్రపతికి పంపారు. అందులో ఒకటి ముంపు మండలాల బదిలీకి సంబంధించిం దైతే మూడోది, ముఖ్యమైందీ ప్రత్యేక హోదా. హోదా ఇవ్వాలని ఆవేళ కేబినెట్‌ తీర్మానం చేసి ప్లానింగ్‌ కమిషన్‌కు ఆదేశాలు కూడా ఇచ్చింది. అత్యంత ముఖ్యమైన దీన్ని ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలే దు..’’ అని వివరించారు. ‘‘నిన్న మోదీ గారీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో ఆమోదం పొందిందని వీళ్లు చెబుతున్న దాన్లో ఏముందంటే..  2010–11లోని ధరల ప్రకారం టెండర్లు పిలిచి 2013లో సవరించి ఖరారు చేసిన రు.16 వేల కోట్లకే పరిమితమవుతామని, పవర్, డ్రింకింగ్‌ వాటర్‌ కాంపొనెంట్లకు సంబంధించిన రూ.2800 కోట్లను ఇవ్వబోవడం లేదని,   విభజన నాటికి పోలవరంపై ఖర్చు చేసిన రు. 5,500 కోట్లకూ...’’ అని జగన్‌ అంటుండగా స్పీకర్‌ మైక్‌ కట్‌ చేసి మంత్రి దేవినేనికి మాట్లాడే అవకాశం ఇచ్చారు.

స్పీకర్‌ వ్యాఖ్యలతో వివాదం..
మంత్రి మాట్లాడిన తర్వాత జగన్‌కు అవకాశం ఇస్తానని చెప్పడంతో విపక్ష సభ్యులు శాంతించి తమ సీట్లకు వెళుతున్న దశలోనే స్పీకర్‌ కోడెల.. (ప్రతిపక్ష నాయకుణ్ణి ఉద్దేశించి) జగన్‌ గారు, ఈ రకమైన దాడి మంచిది కాదండి, మీరు చెప్పిందల్లా వినాలనుకోకండి అని అన డంతో మళ్లీ వాగ్వాదం జరిగింది. అప్పుడు మంత్రి దేవినేని మాట్లాడుతూ 2014 మార్చి 2 నాటి క్యాబినెట్‌ తీర్మానాలు చేసినా ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖ వాటిని తిరస్కరించిందన్నారు.  వైఎస్‌ జగన్‌పైనా, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిపైన ఆరోపణలు చేశారు.

మరిన్ని వార్తలు