కడప పెద్దదర్గాలో వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనలు

17 May, 2019 00:36 IST|Sakshi

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ప్రతిపక్ష నేత

కడప కార్పొరేషన్‌: వైఎస్సార్‌ జిల్లా కడప నగరంలోని పెద్దదర్గాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ గురువారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పులివెందుల నుంచి సాయంత్రం 6 గంటలకు పెద్దదర్గాకు చేరుకున్న ఆయనకు కడప ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్‌బీ అంజద్‌బాషా, దర్గా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. దర్గా సాంప్రదాయాన్ని పాటిస్తూ జగన్‌కు తలపాగా చుట్టి సత్కరించారు. అనంతరం జగన్‌ పెద్దదర్గాలోని హజరత్‌ పీరుల్లామాలిక్‌ సాహెబ్‌ మజార్‌ను దర్శించుకుని చాదర్‌ను సమర్పించారు.  

దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని, కొద్దిసేపు ధ్యానం చేశారు. ఆ తర్వాత పెద్దదర్గా ఆవరణలో అంజద్‌బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌తో కలిసి పాల్గొన్నారు.  జగన్‌ మాట్లాడుతూ.. అల్లా కృప రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. 

మరిన్ని వార్తలు