గత ఎన్నికల్లో ఒక్కశాతం ఓట్లతో అధికారానికి దూరమయ్యం
ప్రజల సహాకారంతో 151 అసెంబ్లీ సీట్లు సాధించాం
దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పాలన చేస్తాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఐదేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలకు ఏ కష్టమొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే అండగా ఉందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలో జరిగిన సమావేశంలో వైఎస్సార్సీపీ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఆయనను ఎనుకున్నారు. అనంతరం సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు. 2014లో కేవలం ఒక్కశాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యామని గుర్తుచేశారు. చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోవడంతో ఈ ఎన్నికల్లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించామని అన్నారు. ఈ పరిణామం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయం అని వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. అక్రమాలకు పాల్పడితే దేవుడు, ప్రజలు ఏరకంగా మొట్టికాయలు వేస్తారో ప్రజలందరూ చూశారని వ్యాఖ్యానించారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు నాయుడు అక్రమంగా కొనుగోలు చేసిన ఎమ్మెల్యే సంఖ్య 23. చివరికు చంద్రబాబుకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య 23. ఫలితాలు వచ్చిన తేదీ కూడా 23. గతంలో మన పార్టీ నుంచి ఫిరాయించిన ఎంపీల సంఖ్య 3. ఈ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఎంపీల సంఖ్య 3. ప్రజలు మనకు గొప్ప బాధ్యతను అప్పగించారు. వారి ఆశలకు అనుగుణంగా పనిచేయాలి. 2024లో ఇంతకంటే గొప్ప విజయం సాధించాలి. మన సమర్థతకు మద్దతుగా ఓటేసే పరిస్థితి రావాలి. దేశం మొత్తం మన పాలనవైపు చూసేలా చేస్తాం. సుపరిపాలకు మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఈ విజయానికి కారణం నాతో పాటు మీ అందరి కృషి. ప్రతి గ్రామంలోని కార్యకర్త నాకు తోడుగా ఉండడంతోనే ఈ విజయం సాధించాం’’ అని పేర్కొన్నారు.