నేడు శ్రీవారి దర్శనం ∙ ఎయిర్పోర్టులో పార్టీ శ్రేణుల ఘనస్వాగతం
సాక్షి, తిరుమల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తిరుమల వచ్చారు. రాత్రి 10.15 గంటలకు ఇక్కడి రాధేయం అతిథిగృహానికి చేరుకున్నారు. రిసెప్షన్ సూపరింటెండెంట్ పార్థసారథి పుష్పగుచ్ఛంతో ఆయనకు స్వాగతం పలికారు. ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా సాగడంలో భాగంగా శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకునేందుకు వైఎస్ జగన్ తిరుమల వచ్చారు. శనివారం ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం శ్రీవారిని దర్శించుకుని, ఆశీస్సులు అందుకోనున్నారు.
ఆయన వెంట ఎంపీలు వేణుంబాకం విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, వరప్రసాద్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు నారాయణస్వామి, ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, పార్టీ నేతలున్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి తిరుపతి ఎయిర్పోర్టుకు విచ్చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి రేణిగుంట ఎయిర్ పోర్టులో పార్టీ శ్రేణులనుంచి ఘనస్వాగతం లభించింది. భారీ సంఖ్యలో పార్టీనాయకులు, కార్యకర్తలు తరలివచ్చి తమ అభిమాన నాయకుడికి స్వాగతం పలికారు. ఎయిర్పోర్టు ఆవరణ జనసందోహమైంది. స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులను జగన్ పేరుపేరునా పలకరించారు.