దేశంలోనే ఏపీని అగ్రభాగాన నిలపాలనేది నా దార్శనికత

6 Apr, 2019 05:39 IST|Sakshi

ట్విట్టర్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అన్నింటా అగ్రభాగాన నిలపాలనేది తన దార్శనికత అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ఒక పారదర్శకమైన, సాంకేతికాభివృద్ధితో ముందుకెళుతున్న, అవినీతి లేని వికేంద్రీకృతమైన ప్రభుత్వ పాలనను మీ ముంగిళ్లలోనే అందించాలనేది నా ఆకాంక్ష. నిలకడగా రాణించే అభివృద్ధితో మన రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన ఉండేలా చేయాలనేది నా ఆలోచన’’ అని జగన్‌ ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

జగ్జీవన్‌రామ్‌కు జగన్‌ నివాళి..
అణగారిన వర్గాల సంక్షేమం, వారి సమానత్వం కోసం ఒక సామాజిక కార్యకర్తగా పోరాటం చేసిన మహానుభావుడు బాబూ జగ్జీవన్‌రామ్‌ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీర్తించారు. జగ్జీవన్‌రామ్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన్ను జగన్‌ స్మరించుకుంటూ నివాళులర్పించారు. రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం తేగలిగారని శ్లాఘిస్తూ శుక్రవారం ట్వీట్‌ చేశారు. 

>
మరిన్ని వార్తలు