సీఎం..సీఎం

30 May, 2019 14:17 IST|Sakshi
పులివెందులలో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్‌ జగన్‌

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో ప్రతిధ్వనించిన నినాదాల హోరు

విజయహాసంతో సొంతగడ్డకు..

నిశ్చయ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

తొలుత కడప పెద్దదర్గా సందర్శన

పులివెందుల చర్చిలో ప్రార్థ్ధనలు ఇడుపులపాయలో నివాళులు

ప్రియతమ నేతను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం

ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సాధించి చరిత్రసృష్టించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారంసొంత జిల్లాకు వచ్చారు. ఫలితాలు వెలువడ్డాకనిశ్చయ ముఖ్యమంత్రి జిల్లాకు రావడం తొలిసారికావడంతో జనం ఆయన్ను చూసేందుకు పోటీపడ్డారు. పార్టీ నాయకులు..కార్యకర్తలు..ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆయన పర్యటన సాగిన ప్రతి ప్రాంతం సీఎం..సీఎం అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది. ప్రియతమ నేత
ముఖ్యమంత్రి కానున్నారనే ఆనందం అందరిలోవెల్లివిరిసింది. వైఎస్‌ జగన్‌ అందరికీ అభివాదం చేస్తూ‘విజయ హాసం’తో ముందుకు సాగిపోయారు. కడపదర్గాలో..సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలనంతరం ఇడుపులపాయలోని తండ్రి సమాధివద్ద నివాళులర్పించారు.

సాక్షి కడప : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఇడుపులపాయలోని దివంగత సీఎం వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. వైఎస్సార్‌ ఘాట్‌కు పూలమాల వేసిన ఆయన అనంతరం పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ముందురోజు ఇడుపులపాయకు వచ్చి తండ్రి సమాధి వద్ద ఆశీస్సులు తీసుకున్నారు. వైఎస్‌ జగన్‌తోపాటు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, అంజద్‌బాష, సుధీర్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, డాక్టర్‌ వెంకట సుబ్బయ్య, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నేతలు నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి, వైఎస్‌ కొండారెడ్డి తదితర నేతలు  వైఎస్సార్‌ ఘాట్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున వైఎస్సార్‌ అమర్‌రహే అంటూ చేస్తున్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. అంతకుముందు ఇడుపులపాయలో హెలికాఫ్టర్‌ దిగి వస్తున్న వైఎస్‌ జగన్‌ను చూడగానే  సీఎం ..సీఎం అంటూ పెద్ద ఎత్తున అభిమానులు నినాదాలు చేశారు. ఘాట్‌ వద్ద కూడా ఆయన ప్రతి ఒక్కరినీ పలుకరించారు.

ఎయిర్‌పోర్టు వద్ద ఘన స్వాగతం
తొలుత ఉదయం కడప ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ప్రత్యేక విమానంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలతో కలిసి ఆయన కడపకు వచ్చారు. ఎయిర్‌పోర్టులో దిగగానే కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కలెక్టర్‌ హరి కిరణ్, ఎస్పీ అభిషేక్‌ మహంతి, జాయింట్‌ కలెక్టర్‌ కోటేశ్వరరావు తదితరులు స్వాగతం పలికారు. వారితోపాటు ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, అంజద్‌బాష, రఘురామిరెడ్డి, సుధీర్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, వెంకట సుబ్బయ్య, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, సురేష్‌బాబు,ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో ఆయన ముచ్చటించారు. మాజీ ఎమ్మెల్యేలు ఎంవీ రమణారెడ్డి, గడికోట మోహన్‌రెడ్డి, శివరామకృష్ణారావు, మాజీమంత్రి ఖలీల్‌బాష, జెడ్పీ చైర్మన్‌గూడూరు రవి, మాజీ ఎమ్మెల్సీలు పోచంరెడ్డి సుబ్బారెడ్డి, వెంకట శివారెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ విష్ణువర్దన్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ దేవనాథరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు కాల్‌టెక్స్‌ హఫీజుల్లా,  అల్లె ప్రభావతి తదితరులు మాట్లాడారు. కడప వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు, డివిజన్‌ ఇన్‌చార్జులను  వైఎస్‌ జగన్‌కు ఎమ్మెల్యే అంజద్‌బాషా పరిచయం చేశారు

ఉన్నతాధికారులతో కాసేపు
ఎయిర్‌పోర్టు గ్యాలరీలో కాబోయే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని జిల్లా ఉన్నతాధికారులు కలిశారు. జిల్లా కలెక్టర్‌ హరి కిరణ్‌ అధికారులను ఆయనకు పరిచయం చేశారు. ఆప్యాయంగా వారిని శాఖలు అడిగి తెలుసుకున్నారు. మీ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వారు వివరించారు. ఎయిర్‌పోర్టు వద్ద వేదపండితులు ఆశీర్వదించారు.   బ్రహ్మకుమారీలు వైఎస్‌ జగన్‌ను కలిపి జ్ఞాపికను అందజేశారు. పర్యటన ప్రాంతాల్లో  ఎస్పీ అభిషేక్‌ మహంతి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షించారు.

కడప దర్గాలో..
ఎయిర్‌పోర్టు నుంచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  11.55 గంటలకు కడప పెద్ద దర్గా చేరుకున్నారు.  ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సీపీ నగర మైనార్టీ అధ్యక్షుడు ఎస్‌ఎండీ షఫీ శాలువా కప్పి టోపీ ధరింపజేశారు. దర్గా పీఠాధిపతి హజరత్‌ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌ దర్గా  సంప్రదాయాన్ని పాటిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తలపాగా చుట్టారు. అనంతరం జగన్‌ హజరత్‌ పీరుల్లామాలిక్‌ మజార్‌ను దర్శించుకుని చాదర్,పూల చాదర్‌లు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా ఆవరణలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించి ఫాతెహా చేశారు. దర్గా పీఠాధిపతి వైఎస్‌ జగన్‌కు గురువుల విశిష్టతను తెలియజేసి, జ్ఞాపికతో సత్కరించారు. పీఠాధిపతితో నిశ్చయ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమై ఆశీస్సులు తీసుకున్నారు.  వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌(ఏపీయూడబ్లు్యజే) జిల్లా అధ్యక్షుడు పి. రామసుబ్బారెడ్డి, రాష్ట్ర నాయకులు ఎం.బాలక్రిష్ణారెడ్డి(సాక్షి), సూర్యనారాయణరావు(సీపీసీ), రామాంజనేయరెడ్డి(జేసీఎన్‌), ఆర్‌ఎస్‌ రెడ్డి, వెంకటరెడ్డి, వీడియోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ తదితరులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ వస్తున్నారని తెలుసుకొని పెద్ద ఎత్తున ప్రజలు మండుటెండను సైతం లెక్కచేయక నిరీక్షించారు. జగన్‌ను చూడగానే యువత పెద్దపెట్టున సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. కడప నుంచి పులివెందులకు హెలికాప్టర్‌‡లో వెళ్లారు.

సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
నిశ్చయ ముఖ్యమంత్రి బుధవారం మధ్యాహ్నం 1.15గంటలకు పులివెందుల చేరుకోగానే ఘన స్వాగతం లభించింది. ధ్యాన్‌చంద్‌ క్రీడా మైదానంలో హెలికాప్టరు దిగగానే ఆయనకు మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ వైఎస్‌ ప్రమీలమ్మ, వైఎస్సార్‌సీపీ నేతలు వైఎస్‌ మనోహర్‌రెడ్డి, ఎన్‌.శివప్రకాష్‌రెడ్డి, వైఎస్‌ అభిషేక్‌రెడ్డి, ఆర్డీఓ నాగన్న, తహసీల్దార్‌ మునాఫ్‌లతోపాటు అధికారులు ఘన స్వాగతం పలికారు. మహిళా కౌన్సిలర్లు శాలువా కప్పి సన్మానించారు. తర్వాత రోడ్డు మార్గాన వైఎస్‌ జగన్‌ సీఎస్‌ఐ చర్చికి  1.40గంటలకు చేరుకున్నారు. అక్కడ  ప్రార్థనల్లో పాల్గొన్నారు. పులివెందుల డివిజన్‌ పరిధిలోని  చర్చి ఫాదర్లు స్వాగతం పలికి ఆహ్వానించారు. రాయలసీమ సీఎస్‌ఐ చర్చి బిషప్‌ బీడీ ప్రసాదరావు, పులివెందుల చర్చి ఫాదర్‌ బెన్‌హర్‌బాబు, ఆర్‌సీఎం ఫాదర్‌ జయరాజ్, రిటైర్డు బిషప్‌ ఫెడ్రిక్‌లు ప్రత్యేక ప్రార్థనలు చేసి వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించారు.

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, వైఎస్‌ కుటుంబ సభ్యులు వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి, వైఎస్‌ మధురెడ్డి, ఎన్‌.శివప్రకాష్‌రెడ్డి, వైఎస్‌ అభిషేక్‌రెడ్డి, డాక్టర్‌ ఇసీ గంగిరెడ్డిలు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ సీఎస్‌ఐ చర్చి బిషప్‌ బీడీ ప్రసాదరావు మాట్లాడుతూ దేవుని ఆశీర్వాదాలు, ప్రజల అండదండలతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అతి చిన్నవయస్సులోనే అఖండ మెజార్టీ సాధించి ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు.  మంచి ఉద్ధేశంతో ప్రజలు ఆయనను ఎన్నుకున్నారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తారన్నారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని వైఎస్‌ కుటుంబ సభ్యులు, ఫాదర్లు శాలువా కప్పి సత్కరించారు. మధ్యాహ్నం  2.25 గంటల ప్రాంతంలో వైఎస్‌ జగన్‌ చర్చి నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు. పులివెందులలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు హెలిప్యాడ్‌ వద్దకు అధిక సంఖ్యలో వచ్చారు.  సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు. చర్చి వరకు కాన్వాయ్‌తోపాటు పరుగులు తీశారు. వైఎస్‌ జగన్‌ అందరికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

మరిన్ని వార్తలు